
హీరోయిన్లకి ముఖమే అందం. తన అందాన్ని ప్రతిబింబింప చేసేది ముఖమే. అందుకోసం ముఖాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. దానికి ఎప్పటికప్పుడు సరికొత్త అందాలను అద్దుతుంటారు. తెరపై మరింత అందంగా కనిపించి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటారు. అలా తన అందానికి కాస్త మెరుగులు దిద్దుకునేందుకు ప్రయత్నించిన తమిళ నటి ఫేస్ అంద వికారంగా మార్చింది ఒక డాక్టర్. తాజాగా ఈ ఘటన తమిళనాట హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే..
తమిళ బిగ్బాస్ ఫేమ్, `ప్యార్ ప్రేమ కాదల్` హీరోయిన్ రైజా విల్సన్ సాధారణ ఫేషియల్ కోసం ఓ క్లినిక్కి వెళ్లింది. కానీ అందులో ఉండే మహిళా డాక్టర్ భైరవి నటి చర్మానికి కొత్త నిగారింపుని, మరింత అందాన్ని తీసుకొస్తానని చెప్పింది. అందుకోసం ఆమెకి ముఖంపై చర్మ చికిత్స చేసింది. అది కాస్త వికటించి నటి కన్ను వాచిపోయింది. ఫేస్ సైతం నలుపురంగులోకి వచ్చింది. దీంతో రైజా ఫేస్ అందవికారంగా మారిపోయింది. దీంతో పాపం నటి తీవ్ర భంగపాటుకి గురయ్యింది.
ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేసింది. `నాకు అవసరం లేకపోయినా డాక్టర్ భైరవి నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు` అంటూ ఓ ఫొటోను ఇన్స్టా స్టోరీలో యాడ్ చేసింది. `డా.భైరవి తన దగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది` అంటూ పలువురు మోసపోయిన వారి వివరాలు పంచుకుని షాక్కి గురైంది రైజా.
జస్ట్ ఫేషియల్ కోసం వెళ్లిన నటి చివరకు ముఖ అందాన్నే కోల్పోవాల్సి వచ్చింది. రైజా 2017లో 'వెలయ్యిలా పట్టధారి 2' సినిమాలోని ఓ చిన్నపాత్రతో నటిగా కోలీవుడ్కి పరిచయమైంది. తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లోనూ పాల్గొని పాపులర్ అయ్యింది. 'ప్యార్ ప్రేమ కాదల్' సినిమాతో హీరోయిన్గా మారింది. దీనికిగానూ ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'అలైస్', 'కాదలిక్క యారుమిల్లై', 'హ్యాష్ట్యాగ్ లవ్' అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజా ఘటనతో ఇప్పుడు నటిగా ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు.