యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సాహోపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి.
ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో సాహో చిత్రం నిరాశపరిచింది. సాహో ఎఫెక్ట్ నుంచి బయటపడ్డ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. యువి క్రియేషన్స్ సంస్థ సాహో చిత్రాన్ని 350 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సంగతి తెలిసిందే.
సాహో చిత్రంతో యువి క్రియేషన్స్ నిర్మాతలకు చిక్కులు ఎదురవుతున్నాయి. బాగ్స్ సంస్థ సాహో నిర్మాతలపై కేసు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. సాహో నిర్మాతలకు, బాగ్స్ కంపెనీకి మధ్య 1.45 కోట్ల వ్యవహారానికి సంబంధించిన విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.