ఒకప్పుడు వరసపెట్టి దెయ్యాల సినిమాలతో భయపెట్టాలని చూసి, ఆ పని చేయలేక, వాటి నుంచి వచ్చిన నష్టాలతో భయపడ్డ వర్మ..ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలపై పడ్డారు. ఎలక్షన్స్ కు ముందు ఓ పార్టీని పనిగట్టుకుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇదిగో ఈ కొత్త సినిమాని దింపారు. అయితే మీడియాకు తప్ప జనాలకు పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి లేనట్లుంది. చంద్రబాబుపై కోపం గానీ, ప్రేమ కానీ ఎలక్షన్స్ కు ముందు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లేవు.
ఒకప్పుడు వరసపెట్టి దెయ్యాల సినిమాలతో భయపెట్టాలని చూసి, ఆ పని చేయలేక, వాటి నుంచి వచ్చిన నష్టాలతో భయపడ్డ వర్మ..ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలపై పడ్డారు. ఎలక్షన్స్ కు ముందు ఓ పార్టీని పనిగట్టుకుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇదిగో ఈ కొత్త సినిమాని దింపారు. అయితే మీడియాకు తప్ప జనాలకు పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి లేనట్లుంది. చంద్రబాబుపై కోపం గానీ, ప్రేమ కానీ ఎలక్షన్స్ కు ముందు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లేవు. దానికి తోడు రాజకీయ చిత్రాలు చూసే మూడ్ జనాల్లో కనపడటం లేదు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ మినహా. అంత పెద్ద సంఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. ఇటువంటి రాంగ్ టైమ్ లో వచ్చిన ఈ సినిమా నిజ జీవిత వ్యక్తులను గుర్తు చేస్తూ తెరపైకి తెస్తూ ఆసక్తి రేపే ప్రయత్నం చేసారు. మరి దర్శకుడు వర్మ చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా...ఈ సినిమా కోసం వర్మ రాసుకున్న కథేంటి...అసలు వర్మ ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
కథేంటి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన ఎలక్షన్స్ లో పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. వెలుగు దేశం పార్టీ (వీడీపీ)పై ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. 151 సీట్లతో జగన్నాథ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి , వీడిపి పార్టి అధినేత బాబు తట్టుకోలేకపోతాడు. ఆయన కుమారుడు చినబాబుకు ఏడుపు ఒకటే తక్కువ. దానికి తోడు శాశన సభలో బాబుకు పరాభవం ఎదురౌతుంది. అది తట్టుకోలేక, అహం దెబ్బ తిన్న బాబు.., మిగతా పార్టీ నేతలతో కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎలాగైనా గద్దె దించేయేలాని నిర్ణయించుకుంటాడు. ఆయనకు తోడుగా మరో పార్టీ నాయకుడు కళ్యాణ్ సహకరిస్తూ ఉంటాడు. అయితే రివర్స్ లో వీయస్ జగన్నాథ రెడ్డి(అమల్ అజ్మీర్) చేసే ప్రజోపయోగ పనులకు జనాల నుంచి మద్దతు రోజు రోజుకీ పెరిగిపోతూంటుంది. ఇది బాబుకి మరింతగా కడుపు మండేలా చేస్తుంది. రాష్ట్రంలో ఎలాగైనా అశాంతి రేపాలని తన వాళ్లకు సూచిస్తాడు. రాజకీయ ఎత్తుగడ మొదలవుతుంది.
అప్పుడు బాబుకు అత్యంత సన్నిహితుడు దయనేని రమా రంగంలోకి దిగుతాడు ...ప్రభుత్వంపై, సీఎం పైనా దారుణమైన ఆరోపణలు చేస్తాడు. ప్రజల్లో జగన్నాథ రెడ్డి పరువు తీసేయాలని చూస్తాడు. జగన్నాథ రెడ్డికు జనాల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టేందుకు ప్లాన్స్ వేస్తూ, ఆరోపణలకు తగ్గ ఆధారాలు సృష్టిస్తూ ఉంటాడు. జగన్నాథ రెడ్డి తన వాళ్లతో కలిసి వీటిని తిప్పి కొడుతూంటాడు. ఇలా జగన్నాథ రెడ్డికు , దయనేని రమా కు మద్య వార్ సాగుతూంటుంది.
ఇదిలా తీవ్ర రూపం దాల్చగానే బెజవాడ బెంజ్ సర్కిల్ లో జనాలంతా చూస్తూండగానే దయనేని రమాని కొందరు దారుణంగా హత్య చేస్తారు. అక్కడ నుంచి రాజకీయాలు రక్తసిక్తం అవుతాయి. రమ హత్యతో రాష్ట్రంలో శాంతి భధ్రతల సమస్య తలెత్తుతుంది. గంగవీటి భవాని (ధనరాజ్), ఓబుల్ రెడ్డిలకు ఈ మర్డల్ లో భాగం ఉందని సిట్ స్వప్న వారిని అరెస్ట్ చేస్తుంది. మరో వైపు కేంద్రం కూడా ఈ హత్య విషయంలో జోక్యం చేసుకుంటుంది.
ఆ హత్య ..ముఖ్యమంత్రే చేయించాడని ప్రచారం జురుతూంటాడు. అలా ప్రతిపక్ష నాయకుడు చేసిన కుట్రలకు సీఎం రాజీనామాకు సిద్దం అవుతాడు. అయితే అసలు ఈ హత్య ఎవరు చేసారు..ఈ హత్య వెనక ఎవరి హస్తం ఉంది... అసలు ఈ రాజకీయ డ్రామా ముడి ఎలా వీడుతుంది? ప్రంపచ శాంతి పార్టీ అధ్యక్ష్యుడు పీపీ జాల్ కథేంటి...మన సేన అధ్యక్ష్యుడు ప్రణవ్ కళ్యాణ్ ఏ తరహా రాజకీయం చేస్తూంటాడు, మధ్యంతర ఎన్నికలు వస్తాయా...వస్తే ఎవరు గెలుస్తారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది:
కమ్మ, రెడ్లు అంటూ టైటిల్ లోనే వివాదాన్ని నింపుకుని సంచలనం సృష్టించి, డబ్బులు చేసుకోవాలనే వర్మ ప్రయత్నం ఫలించేటట్లు కనపడటం లేదు. చాలా నాశిరకంగా సినిమా ఉంది. ఏ పార్టీ వారు కూడా నచ్చి మెచ్చుకునేటట్లు లేదు. ఏదో వర్మ కు అప్పటికప్పుడు పుట్టిన ఐడియాని తెరకెక్కించేసినట్లు ఉంది కానీ, కథపై కసరత్తు చేసినట్లు లేదు. ఎందుకంటే సినిమా ఇంటర్వెల్ కు వచ్చేసరికే ...విషయం ఏంటో అతి సాధారణ ప్రేక్షకుడుకు అర్దమైపోతుంది. అక్కడ నుంచి చాలా ఆసక్తిగా ఎవరు రమ ని మర్డర్ చేసారంటూ నడిపినా ...ఇంట్రస్ట్ పుట్టలేదు. ఏదో పొలిటీషన్స్ పై స్పూఫ్ లు చూస్తున్నట్లు ఉంది కానీ ఓ సినిమా చూస్తున్న వాతావరణం లేదు. చాలా సిల్లిగా సీన్స్ వచ్చి పోతూంటాయి. రాష్ట్ర రాజకీయాలు వర్మకు సిల్లీగా అనిపించవచ్చు ఏమో చూసేవారు ఓ సీరియస్ సినిమాని చూద్దామనే వస్తారనే విషయం మర్చిపోయినట్లున్నాడు.దానికి తోడు స్లోగా నేరేషన్ సాగుతూంటుంది. వర్మ ఊహించినంత జోక్ గా రాజకీయాలు నడవవు అనేది సినిమా చూస్తున్న ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది.
హైలెట్స్:
ప్రస్తుతం ఆంద్రాలో లీడింగ్ లో ఉన్న రాజకీయనాయకులందరి రూపు రేఖలు, హావ భావాలు అలా దించేసారు. దాంతో వాళ్లు మొదట కనడపినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మెల్లిమెల్లిగా ఇంట్రస్ట్ తగ్గిపోయింది. ముఖ్యంగా ప్రపంచ శాంతి పార్టీ అధినేతల క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. అంతలా డిజైన్ చేసారు. అయితే పాత్రధారుల ఎంపికపై పెట్టిన శ్రద్దలో సగం అయినా స్క్రిప్టుపై పెట్టి ఉంటే సినిమా వేరే విధంగా ఉండేది.
మైనస్
ఇంటర్వెల్ ముందు వరకూ... మనందరికీ తెలిసిన రాజకీయాలనే సెటైర్ గా చూపించటంతో బాగానే లీనం అయితాం. అయితే ఇంట్రవెల్ లో దయానేని రమ హత్య తో బ్యాంగ్ ఇచ్చారు. బాగానే ఉందని సెకండాఫ్ చూస్తే పూర్తి డొల్లగా మారింది. సెకండాఫ్ మొత్తం ఆ మర్డర్ చుట్టూ నడపాలని చూడటం దారుణం. తరవాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుడిలో చంపేసినట్లైంది. చివర్లో ఫలానా వాళ్లు చంపుతారేమో అని ఎక్సపెక్ట్ చేస్తే దాన్ని ఓ రాజకీయ హత్యగా చూపారు. ఆ మర్డర్ చుట్టూ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు కానీ అది అంతలా పండలేదు. తొంభైల్లో జరిగే సినిమాలాగ అనిపించింది.
పాత్రలు..పాత్ర ధారులు
అజ్మల్ అమీర్ ..జగన్ ని దించే ప్రయత్నం చేసారు. బాబు పాత్ర వేసినతను మాత్రం..నిజ జీవిత బాబుని దించేసాడు. అందుకు మంచి కసరత్తే చేసారని అర్దమవుతోంది.ధన్ రాజ్, టీవి నైన్ స్వప్న, కత్తి మహేష్ వంటివారు తమ పరిధిలో బాగానే చేసారు. అలీ, పృధ్వీ, బ్రహ్మానందం వంటివారు అలంకారమయ్యారు. మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం పెద్దగా టచ్ చేయేలేదు. లేని పోని తలనొప్పులు ఎందుకనుకున్నారో ఏమో కానీ, కేవలం సెటైర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టు ఉంది. కథలో ఆయన్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు.
బ్రహ్మానందంను ట్రైలర్ లో చూపించినంత సేపు కూడా తెరపై లేరు. ఆయన పాత్రకైతే సినిమా ఎండింగ్ లో ఒకే ఒక్క డైలాగ్. స్పీకర్ పమ్మినేనిగా ఆలీ బాగా నవ్వించారు. పీపీ జాల్ పాత్రలో రాము బాగా చేసారు.
టెక్నికల్గా....
ఎప్పటిలాగే సినిమాని చీప్ గా చుట్టేసినా, టెక్నికల్ గా క్వాలిటీ బాగానే ఉంది. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. రవి శంకర్ రీరికార్డింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సోసో గా ఉన్నాయి.
ఫైనల్ ధాట్...
సినిమా చివర్లో వర్మ ఓ మాట చెప్తారు ... ‘‘రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే’’ . అయితే ఆ విషయం వర్మ మర్చి పోయి ఈ సినిమా తీసారు.
ఎవరెవరు
నటీనటులు : అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ తదితరులు
దర్శకత్వం : సిద్దార్థ తాతోలు
నిర్మాత : అజయ్ మైసూర్
బ్యానర్ : టైగర్ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్
మ్యూజిక్ : రవి శంకర్
సినిమాటోగ్రఫి : జగదీష్ చీకటి
ఎడిటింగ్ : అన్వర్ అలీ
రిలీజ్ డేట్ : 2019-12-12
Rating: 2/5