
గత కొద్ది రోజులుగా ట్రెండ్ లో ప్రభాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్ ఉంటూ వస్తోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ చిత్రం నెగిటివిటీని ఎదుర్కొంటోంది. టీజర్ లో వాడిన గ్రాఫిక్స్ మీద విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. విఎఫ్ ఎక్స్ దారుణంగా ఉందని, రావణాసురుడు అసలు బాగోలేని ఇలా తలో మాటా అన్నారు. దాంతో అలెర్ట్ అయిన టీమ్ హైదరాబాద్ ఏఎంబి మాల్ లో ప్రత్యేకంగా త్రీడి వెర్షన్ ని మీడియాకు ప్రదర్శించారు. మీడియా బాగానే పొగిడింది. అతిధిగా వచ్చిన దిల్ రాజుతో పాటు యూనిట్ సభ్యులందరూ కంటెంట్ మీద గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
అక్కడితో ఆది పురుష్ మీద ఉన్న సందేహాలకు చెక్ పడ్డాయో లేవో కానీ...మరోవైపు వివాదాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడు, రావణుడి గెటప్స్ కి సంబంధించి పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాముడి కథను విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో విచిత్రంగా చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో యానిమేషన్ జొప్పించారని, అవి కూడా సహజంగా లేవని, కార్టూన్ నెట్వర్క్ స్థాయిలో సినిమాను తీసి అయిదు వందల కోట్ల బడ్జెట్ పేరుతో మోసం చేస్తారని నెటిజెన్లు గట్టిగానే తగులుకుంటున్నారు. నేపధ్య సంగీతం, థీమ్, కంటెంట్ గురించి కన్నా ఎక్కువగా విఎఫ్ఎక్స్ గురించే చర్చ జరుగుతోంది.
కొందరు ఏకంగా కోర్టుకు వెళ్ళారు. ఢిల్లీకి చెందిన రాజా గౌరవ్ అనే న్యాయవాది తీస్ హజారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆదిపురుష్ టీజర్ లో రాముని, ఆంజనేయుని అసంబద్ధంగా చూపించాలని ఆయన ఆరోపించారు. యూట్యూబ్ నుండి ఆ టీజర్ వీడియోను వెంటనే తొలగించాలని, అలాగే సినిమా విడుదలపై స్టే విధించాలని కోర్టును ఆయన కోరడం జరిగింది.
ఆదిపురుష్ టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని ఆరోపించారు. వారు తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో ఉన్నట్టుగా టీజర్ లో కనిపిస్తోందని వివరించారు. ఇక, రావణుడ్ని చాలా చవకబారుగా చూపించారని పేర్కొన్నారు. మోడ్రన్ హెయిర్ స్టయిల్, చెవులపై బ్లేడ్ సింబల్స్ తో రావణుడ్ని చిత్రీకరించారని పిటిషనర్ వివరించారు. మొఘల్ చక్రవర్తుల పూర్వీకుడిలా కనిపిస్తున్న రావణుడు గబ్బిలంపై స్వారీ చేస్తున్న దృశ్యాలు కూడా టీజర్ లో ఉన్నాయని తెలిపారు.
శివభక్తుడైన రావణుడికి మీసాలు ఉంటాయని, తలపై నిత్యం బంగారు కిరీటం ఉంటుందని వివరించారు. రావణుడి వాహనం పుష్పక విమానం అని వెల్లడించారు. ఆదిపురుష్ టీజర్ హిందువుల మత విశ్వాసాలను, సంస్కృతి, చరిత్ర, నాగరికతలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించబడితే ఆదిపురుష్ సినిమా కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రక్క సోషల్ మీడియాలో హిందూ పురాణాలను ముఖ్యంగా రామాయణం ను అవమానించే విధంగా, హిందువులను అవమానించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ లైవ్ మోషన్ టెక్నాలజీ ఉపయోగించి నిజమైన నటీనటులతో ఆది పురుష్ తీశారనే పాయింట్ అర్థమైపోయింది. అదేదో ముందే చెప్పుంటే ఇప్పుడే ట్రోలింగ్ జరిగేది కాదు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కొచ్చాడయన్ (తెలుగులో విక్రమసింహ)ని ఈ తరహా సాంకేతికతతోనే తీశారు కానీ సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల జనం మెచ్చలేదు. ఆది పురుష్ కు ఆ సమస్య లేదు. టి సిరీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ అండదండలు ఉన్నాయి.