
నటుడు తిరువీర్ లేటెస్ట్ చేసిన చిత్రం 'పరేషాన్' . ఈ సినిమాకి ప్రత్యేకం ఏంటంటే, రానా దగ్గుబాటి (RanaDaggubati) దీనిని బాగా ప్రమోట్ చెయ్యడమే కాకుండా, దీనికి ప్రెజంటర్ గా కూడా వున్నాడు. ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అంతకు ముందు 'మేమ్ ఫేమస్' (MemFamous) వస్తే, ఆ తర్వాత వచ్చిన ఈ 'పరేషాన్' #Pareshan కూడా అటువంటిదే. తెలంగాణ నేపధ్యం వున్న సినిమాల్లో ఎక్కువగా కనిపించే మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమాకి దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, నిర్మాత సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ఈ సినిమా థియేటర్ లో ఓకే అనిపించుకుంది. ఓటిటి లో చూసే సినిమా అని తేల్చేసారు. దాంతో చాలా మంది ఈ ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 4,2023 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ ఇందులో పాత్రలను సహజంగా చూపించాడు. ప్రతీ పాత్ర చాలా సహజంగా వుండి ఆ పాత్రే కనపడుతుంది తప్ప అందులో నటుడు కనిపించడు, అంతలా తీసాడు. కానీ తెలంగాణా అంటే తాగుడు, తినుడు అనేట్టుగా ఈ సినిమాలో చూపించాడు. పల్లె వాతావరణం, స్నేహితులు, బలాదూర్ గా తిరిగే కొడుకు, ఆ కొడుకును మంచి ఉద్యోగంలో చూడాలనుకున్న తండ్రి ఇవన్నీ బాగున్నాయి.
తిరువీర్ బాగా చేసాడు. ఒక పక్క తండ్రితో తిట్లు తింటూ, ఇంకో పక్క స్నేహితుల దగ్గర డబ్బుల కోసం, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఇలా వైవిధ్యం చూపిస్తూ బాగా చేసాడు. మురళీధర్ గౌడ్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోతున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్టుల కోవలో. అతను ప్రతి తెలంగాణ సినిమాలో కనిపిస్తున్నాడు, అలాగే చాలా సహజంగా నటిస్తున్నాడు కూడా. అతను ఈ సినిమాకి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. జార్జిరెడ్డి, టక్ జగదీశ్ సినిమాలతో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు తిరువీర్. ఇక ఆ తర్వాత హర్రర్ మూవీ ‘మసూద’ సినిమాలో హీరోగా నటించి అదరగొట్టాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్గానూ మసూద మూవీ మంచి విజయాన్ని సాధించింది. దీంతో పక్కా హీరోగా మారిపోయాడు తిరువీర్. పరేషాన్లో తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్నాడు.