నా కూతురిపై అత్యాచారం జరగలేదు, గర్భం దాల్చలేదు: మీడియాతో దిశ తల్లిదండ్రులు

By Siva KodatiFirst Published Aug 8, 2020, 7:36 PM IST
Highlights

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్‌పై ప్రచారమవుతున్న వార్తలపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తమ కూతురు గర్భవతి కాదని, దయచేసి తన మరణం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్‌పై ప్రచారమవుతున్న వార్తలపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తమ కూతురు గర్భవతి కాదని, దయచేసి తన మరణం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు.

దిశ జూన్ నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె మరణించిన తర్వాత వారం రోజులకే సుశాంత్ కూడా బలవన్మరణానికి పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి.

Latest Videos

దిశకు సహాయం చేసే క్రమంలో సుశాంత్‌కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే ఆయన కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దిశ సలియాన్‌ది ఆత్మహత్య కాదని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారంటూ బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాటలపై దిశ తల్లిదండ్రులు వాసంతి సలియాన్, సతీశ్ సలియాన్ ఆవేదన చెందారు. తమ బిడ్డ గర్భవతి కాదు.. ఇప్పుడే కాదు ఎప్పుడూ గర్భం దాల్చలేదని, తనపై ఎన్నడూ అత్యాచారం కూడా జరగలేదని తేల్చి చెప్పారు.

తన అవయవాలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ స్పష్టంగా ఉన్నాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక గురించి ముంబై పోలీసులు తమకు వివరించారని వారు వెల్లడించారు.

దిశకు చెడ్డపేరు తెచ్చేలా ప్రచారం చేయొద్దని.. తన గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పారు. మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛ వుందని, అయితే తమ వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

దిశ గురించి తప్పుగా మాట్లాడవద్దని, నిజానిజాలేమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను అభ్యర్ధించారు. మీడియా వల్ల తాము మానసిక వేదనకు గురవుతున్నామంటూ దిశ తండ్రి ఇది వరకే పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

click me!