రైటర్ ని పక్కన పెట్టేసిన డైరెక్టర్.. ఇద్దరికీ పడడం లేదా..?

By AN TeluguFirst Published Oct 4, 2019, 5:01 PM IST
Highlights

దర్శకుడు త్రినాధరావు నక్కిన, రైటర్ ప్రసన్న మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ కలిసే ఆ రెండు సినిమాలు పూర్తి చేశారు. త్రినాధరావుకి ప్రసన్న కేవలం రైటింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ లో కూడా సపోర్ట్ ఇచ్చేవాడు. 

సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరంటారు. అది నిజమనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు సడెన్ గా ఏదైనా ఇష్యూ వచ్చి విడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఓ డైరెక్టర్ కి, రైటర్ కి మధ్య కూడా అలాంటి పరిస్థితే వచ్చినట్లు తెలుస్తోంది. 'సినిమా చూపిస్తా మావ', 'నేను లోకల్' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన, రైటర్ ప్రసన్న మంచి స్నేహితులు.

ఈ ఇద్దరూ కలిసే ఆ రెండు సినిమాలు పూర్తి చేశారు. త్రినాధరావుకి ప్రసన్న కేవలం రైటింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ లో కూడా సపోర్ట్ ఇచ్చేవాడు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ బాగా పండింది. ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా ఉండేవారు.

దిల్ రాజు వీరి కాంబినేషన్ లో సినిమాలు తీయాలనుకున్నాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మధ్య త్రినాధరావు.. బెల్లంకొండకి ఓ కథ వినిపించాడు. ఆ కథకు బెల్లంకొండకి నచ్చకపోవడంతో విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దానికి కోసం త్రినాధరావు.. సాయికృష్ణ అనే రైటర్ కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రినాధరావు తన టీం తో కలిసి అరకులో కథను డెవలప్ చేయడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాకి కావాలనే ప్రసన్నని తీసుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూలు రావడంతో ఇద్దరికీ పొసగడం లేదని.. ప్రసన్న దర్శకుడిగా సినిమా చేయడానికి ప్రయత్నాలు ఆరంభించినట్లు చెబుతున్నారు. 

click me!