ఆ నిధులతో గ్రామ సచివాలయ నిర్మాణాల...డిజైన్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

By Arun Kumar PFirst Published Dec 3, 2019, 7:10 PM IST
Highlights

పంచాయితీ  రాజ్ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామ  సచివాలయాల నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అమరావతి: ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలో గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 4892 గ్రామ సచివాలయాల నిర్మించనున్నట్లు... అందులో ఇప్పటికే 2781 గ్రామ సచివాలయాలకు పరిపాలనా అనుమతులు లభించాయని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను మంత్రి పరిశీలించారు.

తక్కువ రేటుకే సిమెంట్ ను అందించేలా సిమెంట్ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని ఆదేశించారు. సిమెంట్ బస్తా 240  రూపాయలకే వచ్చేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు వెంటనే కలెక్టర్లు పంచాయతీరాజ్‌, ఆర్ డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షాభియాన్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలని  ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇఎన్‌సి ల ద్వారా పిఇఆర్‌టి చార్ట్ లను సిద్దం చేయించాలని సూచించారు.

 

చేపట్టిన పనులు, పురోగతిపై బాధ్యులైన అధికారులు ఎవరో నివేదికను సిద్దం చేయాలన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల లెవలింగ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణంలో ఉపాధి హామీని వాడుకోవాలని అన్నారు.   

read more  పోలవరం మట్టినీ టిడిపి వదల్లేదు...సమీక్షా సమావేశంలో మంత్రుల సీరియస్ కామెంట్స్

గ్రామీణ పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని... గ్రామాల్లో అవసరమైన చోట్ల సిసి డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నిర్మాణాలను 30శాతం స్వచ్చాంధ్ర ప్రదేశ్ కార్పోరేషన్, మిగిలిన 70 శాతం ఉపాధి నిధులను వినియోగించి చేపట్టాలని... ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1418 పనులకు అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు.ఇప్పటికే 145 అంచనాలకు పరిపాలనా అనుమతులు లభించినట్లు తెలిపారు.  అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సిసి రోడ్లు వేయాలని సూచించారు. 

మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పించాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ప్రహరీగోడల నిర్మాణంకు రూ.601 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా అనుమతి పొందిన స్కూల్ బిల్డింగ్ ప్రహరీలకు నరేగా నుంచి నిధులు కేటాయించాలని అన్నారు.  ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి ప్రహరీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. 

ప్రతి నియోజకవర్గంకు నరేగా కింద రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మార్చి పదో తేదీ నాటికి మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3335 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ నిధులు ఉన్నట్లు తెలిపారు. అందులోనుండి ఇప్పటి వరకు ఖర్చు చేసినవి రూ.896 కోట్లేనని... ఇంకా వినియోగించాల్సిన నిధులు రూ.2457  కోట్లు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జూన్‌ నుంచి పెండింగ్  బకాయిలను విడుదల చేయాలన్న పిఆర్ ఇఎన్‌సి అభ్యర్థనను పరిశీలించాలని కోరారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ హెడ్ ట్యాంక్ లకు రంగులు వేయాలని ఆదేశించారు. సిపిడబ్ల్యు స్కీంల కింద పనిచేస్తున్న వారికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని అధికారులకు సూచించారు. 

read more  పవన్ కాల్షీట్స్ ఇచ్చేశారు....బీజేపీలో జనసేన విలీనమే మిగిలింది...: పేర్ని నాని

161 మండలాల్లో సర్వశిక్షా అభియాన్‌ ద్వారా గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొత్తగా మంజూరు చేసిన స్కూల్  ప్రహరీ నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని...  గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని మంత్రి  అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్ కుమార్‌,  పిఆర్ ఇఎన్‌సి సుబ్బారెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, సర్వశిక్షాభియాన్ ఎస్‌ఇ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 


 

click me!