ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం అందుకు రెండురోజుల ముందే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
అమరావతి: ఆంధర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని కోసం చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరపడానికి సీఎం జగన్ సిద్దమయ్యారు. అయితే అంతకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దాన్ని 18వ తేదీకి అంటే రేపటికి మార్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం మద్యాహ్నం 3 గంటలకు అమరావతిలోని సచివాలయంలో మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు కేబినెట్ భేటీ జరపడం వెనుక జగన్ వ్యూహం దాగివుంది. అసెంబ్లీలో రాజధానిపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలను, నిరసనలను ఎలా అడ్డుకోవాలన్నదానిపై జగన్ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
read more సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్
అసెంబ్లీలో ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం జగన్ మంత్రులకు వివరించనున్నారు. రాజధాని మార్పు రాష్ట్రానికి అవసరమని చెబుతూనే అమరావతికి కూడా న్యాయం చేస్తామని ఈ సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం సభలో ఏ విధంగా నడుచుకోవాలన్న దానిపై మంత్రులకు వివరించనున్నారు. అలాగే వారినుండి కూడా సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయింది. హైపవర్ కమిటీ ఇప్పటివరకు చర్చించిన అంశాలను సీఎం జగన్కు కమిటీ సభ్యులు వివరించనున్నారు.
read more
ఇప్పటికే మూడు సార్లు హై పవర్ కమిటి సమావేశమైంది. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను సీఆర్డీఏ దృష్టికి తీసుకురావాలని హైపవర్ కమిటీ కూడా సూచించింది. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కూడ తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సీఆర్డీఏకు అందిస్తున్నారు. ఇవాళ సాయంత్రమే రైతులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు చివరి రోజు.
ఇవాళ సాయంత్రం మరోసారి భేటీ అయిన తర్వాత ఈ నెల 20వ తేదీన హైపవర్ కమిటీ సీఎం జగన్ కు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుందని ఇదివరకే ప్రకటించగా తాజాగా దాన్ని 18వ తేదీకి మార్చారు.