Hyderabad ఆదిభట్ల వద్ద కారులో మంటలు: కోదాడకు చెందిన వెంకటేష్ సజీవ దహనం

By narsimha lodeFirst Published Nov 26, 2023, 11:16 AM IST
Highlights

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిభట్ల సమీపంలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.ఈ విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదిభట్ల వద్ద  ఆదివారంనాడు తెల్లవారుజామున  కారులో  మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో  కారులోని వ్యక్తి  సజీవ దహనమయ్యాడు.  మృతుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు.  నిన్న సాయంత్రం కోదాడ నుండి  కారులో  వెంకటేష్  హైద్రాబాద్ కు బయలుదేరారు.  ఔటర్ రింగ్ రోడ్డుపై  కారును  నిలిపిఉన్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? ఎవరైనా కారుకు నిప్పు పెట్టారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు వ్యాపించి  వెంకటేష్ సజీవ దహనమైన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు  పోలీసులు సమాచారం ఇచ్చారు.

గతంలో కూడ  కారులో మంటలు వ్యాపించి  ప్రమాదాలు జరిగిన ఘటనలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  నమోదయ్యాయి.ఈ నెల  24న వరంగల్ ఖిల్లా బొల్లికుంట వాగ్దేవి కాలేజీ వద్ద ఓ కారులో మంటలు వ్యాపించాయి. ఈ కారు ఇంజన్ లో కట్టలకొద్దీ  డబ్బు ఉంది. దీంతో  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అందినకాడికి తీసుకెళ్లారు. కారులో  మంటలను పోలీసులు ఆర్పివేశారు. 

ఈ ఏడాది  ఆగస్టు 29వ తేదీన ఎన్టీఆర్ జిల్లా   ఇబ్రహీంపట్టణం మండలం కిలేశపురం వద్ద  కారులో మంటలు వ్యాపించాయి. ఈ కారులో ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది.   ఈ ఏడాది  మే 28న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద  కారులో  మంటలు వ్యాపించాయి. జనగామ నుండి  గోదావరికి వెళ్తున్న సమయంలో కారులో మంటలు వ్యాపించాయి.  ఈ కారులోని ప్రయాణీకులు  ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

కేరళ రాష్ట్రంలోని కన్నూరులో  కారులో మంటలు చెలరేగడంతో గర్భిణీ సహా  ఇద్దరు సజీవ దహనమైన ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 2న చోటు చేసుకుంది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో  ఉన్న నలుగురు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కారును డ్రైవింగ్ చేస్తున్న  వ్యక్తితో పాటు అతని భార్య సజీవ దహనమయ్యారు. మృతురాలు గర్భిణి.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో  కారులో మంటలు వ్యాపించడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారు, లారీ ఢీకొనడంతో  కారులో మంటలు వ్యాపించి కారులోని ముగ్గురు మృతి చెందారు.ఈ ఘటన  2022 మే 17వ తేదీన చోటు చేసుకుంది.

 

click me!