Yashasvi Jaiswal : వచ్చే నెలలో (జూన్) ఐపిఎల్ 2025 ముగియనుంది... ఆ తర్వాతల టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సీరిస్ ప్రారంభం అవుతుంది. 5 టెస్ట్ల సిరీస్ ను ఈ సారి కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి సీనియర్లు లేకుండానే ఆడనుంది టీమిండియా. అశ్విన్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత బ్రేక్ తీసుకున్నాడు... రోహిత్, కోహ్లీలు ఈ నెలలోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు.
సీనియర్లు లేకుండానే యువ భారత జట్టు ఈ ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తోంది. ఈ యువ జట్టులో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టెస్ట్ సీరిస్ ద్వారా అతడు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
రోహిత్, కోహ్లీ లేకపోవడం టీమిండియాకు లోటే... కానీ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను బైటపెట్టే అద్భుత అవకాశమిది. ఈ టెస్ట్ సీరిస్ కు ఇంకా కెప్టెన్ ఎవరో ప్రకటించలేదు... అయితే శుభ్మన్ గిల్ పేరు కెప్టెన్ జాబితాలో ముందు వరుసలో ఉంది. పంత్, నితీష్ రెడ్డి, శ్రేయాస్ అయ్యర్ కూడా లిస్ట్ లో ఉన్నారు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. జైస్వాల్ కి కెప్టెన్ అవుతాడో లేదో తెలీదుగానీ ఓ అరుదైన రికార్డును సాధించి చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
జైస్వాల్ 2023లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. ఇప్పటివరకు 19 టెస్టుల్లో 36 ఇన్నింగ్స్ల్లో 1798 పరుగులు చేశాడు. సగటు 52.88. ఇందులోొ 4 శతకాలు, ఒక ద్విశతకం కూడా ఉంది. 2000 పరుగులకు చేరుకోవడానికి ఇంకా 202 పరుగులు అవసరం.
ఇంగ్లాండ్ పర్యటనలో జైస్వాల్ కొత్త రికార్డు సృష్టించవచ్చు. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. జైస్వాల్ 36 ఇన్నింగ్స్ల్లో 1798 పరుగులు చేశాడు. సెహ్వాగ్, ద్రవిడ్ 40 ఇన్నింగ్స్ల్లో 2000 పరుగులు చేశారు. జైస్వాల్ 3 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు చేస్తే వీళ్లిద్దరి రికార్డులు బద్దలు అవుతాయి.
ఇప్పటివరకు జైస్వాల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేవాడు. కానీ రోహిత్ రిటైర్ అయ్యాడు. జైస్వాల్ కొత్త ఓపెనింగ్ పార్టనర్ కేఎల్ రాహుల్ కావచ్చు. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటన ఉంటుంది.