
వెస్టిండీస్ టూర్లో టీమిండియా బ్యాటర్లు రికార్డులను మెరుగుపర్చుకుంటున్నారు. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ అందుకోగా, రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్లో ఇది 29వ టెస్టు సెంచరీ. 2021 జనవరిలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రస్తుత తరం బ్యాటర్గా ఉన్న విరాట్ కోహ్లీ, మూడున్నరేళ్లుగా సెంచరీ చేయలేక లిస్టులో మూడో స్థానానికి పడిపోయాడు. మార్చి నెలలో ఆస్ట్రేలియాపై అహ్మదాబాద్లో సెంచరీ చేసి కమ్బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, నాలుగు నెలల తర్వాత వెస్టిండీస్ టూర్లో సెంచరీ బాది... 2018 తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ గ్యాప్ని పూడ్చేసుకున్నాడు.
ఆసియా ఖండం అవతల విరాట్ కోహ్లీకి ఇది 28వ సెంచరీ. ఈ లిస్టులో 29 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ మాత్రమే విరాట్ కంటే ముందున్నాడు. 500 మ్యాచుల తర్వాత సచిన్ టెండూల్కర్ 75 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే, 76వ సెంచరీతో విరాట్ కోహ్లీ, మాస్టర్నే దాటేశాడు..
76 అంతర్జాతీయ సెంచరీలు చేయడానికి సచిన్ టెండూల్కర్కి 587 ఇన్నింగ్స్లు అవసరం అయితే, విరాట్ కోహ్లీ 559 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. వెస్టిండీస్పై విరాట్ కోహ్లీకి ఇది 12వ సెంచరీ. సునీల్ గవాస్కర్, విండీస్పై 13 సెంచరీలు చేసి టాప్లో ఉండగా జాక్వస్ కలీస్ 12 సెంచరీలతో కోహ్లీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిల్లియర్స్, విండీస్పై 11 సెంచరీలు చేశాడు..
100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, టాప్లో ఉంటే 76 అంతర్జాతీయ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆగస్టు 2022లో ఆఫ్ఘాన్పై టీ20 సెంచరీ బాది 71వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 11 నెలల గ్యాప్లో 6 సెంచరీలు బాదడం విశేషం.
500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు 500లకు పైగా మ్యాచులు ఆడిన 9 మంది ప్లేయర్లు ఎవ్వరూ కూడా తమ మైలురాయి మ్యాచ్లో 50+ స్కోరు కూడా చేయలేకపోయారు..
తన కెరీర్ 100వ, 200వ, 300వ, 400వ మ్యాచ్లో 50+ స్కోరు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, 180 బంతుల్లో 10 ఫోర్లతో 29వ టెస్టు సెంచరీని అందుకున్నాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా 105 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కి 150 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమిండియా స్కోరుని 330 దాటించారు.