
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంతో భారత జట్టు అనేక రికార్డులను తిరగరాసింది . ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయం.
అలాగే ఇంగ్లండ్పై భారత్కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 1986లో లీడ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్పై 279 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. 34 ఏళ్ల తర్వాత అతి పెద్ద గెలుపును నమోదు చేసింది.
ఇక టీమిండియా పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సైతం కెప్టెన్గా ఘనమైన రికార్డులను అందుకున్నాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని సరసన కోహ్లి నిలిచాడు. ఇంగ్లండ్పై తాజా విజయంతో భారత్లో కెప్టెన్గా కోహ్లి సాధించిన విజయాల సంఖ్య 21కు చేరింది.
Also Read:అంపైర్ తో వాగ్వివాదం: నిషేధం ప్రమాదంలో విరాట్ కోహ్లీ
అంతకుముందు ధోని నేతృత్వంలోని టీమిండియా కూడా భారత్లో 21 టెస్టు విజయాలనే నమోదు చేసింది. దాంతో ధోని రికార్డును కోహ్లీ సమం చేశాడు. భారత్లో కోహ్లి ఇప్పటి వరకు 28 టెస్టులకు సారథ్యం వహించి 21 విజయాలు సాధించి, ఐదు మ్యాచ్లను డ్రా చేసుకోగా, రెండు మ్యాచ్ల్లో ఓడిపోయాడు.
ఇక ధోని విషయానికి వస్తే, అతని కెప్టెన్సీలో టీమిండియా.. భారత్లో 30 మ్యాచ్లు ఆడి 21 విజయాలను అందుకుంది. అలాగే మూడు ఓటములు, ఆరు డ్రాలు ధోని ఖాతాలో ఉన్నాయి.
భారత జట్టు టెస్టుల్లో ఇప్పటివరకూ 300 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఆరు విజయాల్ని నమోదు చేసింది. పరుగుల పరంగా ఈ ఆరు అతిపెద్ద విజయాల్లో ఐదు గెలుపులు కోహ్లి ఖాతాలోనే వుండటం విశేషం.
వీటిలో ఒక్కటి మాత్రమే ధోని ఖాతాలో ఉంది. 2008-09 సీజన్లో మొహాలీలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 320 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2015-16 సీజన్లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమిండియా 337 పరుగుల తేడాతో విజయం సాధించగా, 2016-17 సీజన్లో ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 321 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపొందింది.
2019లో నార్త్ సౌండ్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో టీమిండియా 318 పరుగులతో గెలుపును అందుకోగా, 2017లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్లో 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తాజాగా ఇవాళ ఇంగ్లండ్తో 317 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.