ఖేల్‌రత్నమే: రోహిత్ శర్మను వరించిన అత్యున్నత క్రీడా పురస్కారం

By Siva KodatiFirst Published Aug 21, 2020, 9:37 PM IST
Highlights

టీమిండియా డాషింగ్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వరించింది. ఈ ఏడాదికి గాను ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయిన హిట్ మ్యాన్.. అందరూ ఊహించినట్లుగానే అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నాడు

టీమిండియా డాషింగ్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వరించింది. ఈ ఏడాదికి గాను ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయిన హిట్ మ్యాన్.. అందరూ ఊహించినట్లుగానే అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నాడు. తద్వారా సచిన్ , ధోనీ, కోహ్లీల సరసన రోహిత్ చేరాడు.

క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన అవార్డుల్లో రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వీరిలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ ఖేల్ రత్న అందుకోనున్నారు.

రిటైర్డ్ జస్టిస్ ముకుందమ్ శర్మ నేతృత్వంలోని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ సిఫారసు మేరకు క్రీడా పురస్కారాల జాబితాకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ఇక అర్జున అవార్డుకు 27 మందిని ఎంపిక చేసింది. అయితే రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చానులకు అర్జున పురస్కారాన్ని ఇవ్వడానికి కమిటీ నిరాకరించింది. వీరు గతంలోనే ఖేల్‌రత్న పురస్కారాన్ని తీసుకోవడంతో దాని కంటే తక్కువైన అర్జున అవార్డును ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.  వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006, 2008 ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రజత పథకాలను, 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. 

click me!