రూ.40 కోట్లు ఇవ్వాలి: ఆమ్రపాలిపై సుప్రీంకోర్టుకెక్కిన ధోనీ

By Siva KodatiFirst Published Mar 27, 2019, 11:01 AM IST
Highlights

తనకు రావాల్సిన బకాయిల కోసం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ధోని గత ఆరేళ్లుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆమ్రపాలి గ్రూపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు

తనకు రావాల్సిన బకాయిల కోసం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ధోని గత ఆరేళ్లుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆమ్రపాలి గ్రూపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇందుకు గాను ఆ సంస్థ నుంచి రూ.40 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఆమ్రపాలి నుంచి సరైన స్పందన రాకపోవడంతో మహీ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. ధోని భార్య సాక్షి కూడా ఈ కంపెనీకి చెందిన ఛారిటీ విభాగం కోసం పనిచేస్తున్నారు.

మరోవైపు ఆమ్రపాలి కంపెనీ తమను మోసం చేసిందంటూ సుమారు 46,000 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫ్లాట్లను తమకు కేటాయించకుండా చీట్ చేసిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆమ్రపాలి తన క్రేజ్ వల్లే పెద్ద ఎత్తున తన వెంచర్లను మార్కెటింగ్ చేసుకుందని ధోని తెలిపాడు. ఈ ఆరేళ్లలో తనకు రావాల్సిన అసలు మొత్తం రూ.22.53 కోట్లు, దీనికి 18 శాతం వడ్డీ రూ.16.42 కోట్లు కలుపుకుని రూ.38.95 కోట్లు చెల్లించాలని ధోని లెక్కలతో సహా కోర్టుకు తెలిపాడు.

ఇక ఫ్లాట్ల వ్యవహారంలో గత నెల 28న ఆమ్రపాలి సీఎండీ అనిల్ శర్మతో పాటు డైరెక్టర్లు శివప్రియ, అజయ్ కుమార్‌లను కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. 

click me!