Asia Cup 2022 Final: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న శ్రీలంకకు కాస్త ఊరట. చాలా రోజుల తర్వాత ఆ దేశ ప్రజల ముఖాల్లో మళ్లీ నవ్వులు విరబూశాయి.
యూఏఈ వేదికగా గడిచిన మూడు వారాలుగా క్రికెట్ ప్రేమికులను అలరించిన ఆసియా కప్ నిన్నటి ఫైనల్ తో ముగిసింది. ఆదివారం పాకస్తాన్-శ్రీలంక మధ్య దుబాయ్ వేదికగా ముగిసిన ఫైనల్ పోరులో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది లంకకు ఆరో ఆసియా కప్ కావడం విశేషం. అయితే ఆదివారం రాత్రి దుబాయ్ లో లంక విజయం సాధించగానే శ్రీలంకలో సంబురాలు మిన్నంటాయి. గడిచిన ఏడాదికాలంగా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇది ఊరటనిచ్చే విషయమే. మరీ ముఖ్యంగా గత ఆరు నెలలుగా శ్రీలంక లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి శ్రీలంకలో ప్రజలంతా వారి ఇండ్లల్లో కంటే రోడ్ల మీదే ఎక్కువగా ఉంటున్నారు. నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలతో శ్రీలంక హోరెత్తుతున్నది. మరీ ముఖ్యంగా జూన్, జులైలో అయితే ప్రధాని భవనం, అధ్యక్ష భవనాన్ని కూడా ముట్టడించారు లంక నిరసనకారులు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. అసలు ఈ టోర్నీలో ఆ జట్టు అంచనాలేమీ లేకుండానే బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే లంక..తొలి మ్యాచ్ లో అఫ్గాన్ తో మ్యాచ్ లో ఆడిన తీరును చూసి అసలు ఈ జట్టు.. గ్రూప్ దశ దాటితే మహా గొప్ప అనుకున్నారంతా.. కానీ తర్వాత లంక పుంజుకున్న తీరు ప్రశంసనీయం.
Unlimited HAPPY 😊
Congratulations Team!
We celebrate pic.twitter.com/iJAJE64Cgy
సూపర్-4కు ముందు బంగ్లాదేశ్ ను ఓడించిన శ్రీలంక.. రెండో దశలో భారత్ తో పాటు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లను ఓడించింది. ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంక.. పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి ఆసియా కప్ ను గెలుచుకుంది. దీంతో లంకలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆదివారం రాత్రి పాకిస్తాన్ తో ఫైనల్ ముగిశాక శ్రీలంకలో ఆ దేశ అభిమానులు కొలంబో వీధుల్లో ర్యాలీలు తీశారు. రోడ్లమీదకు వచ్చి శ్రీలంక జాతీయ జెండాలు చేతబట్టుకుని విజయనినాదాలు చేశారు. పలుచోట్ల రాత్రి కర్ఫ్యూ ఉన్నా సెక్యూరిటీ ఆంక్షలున్నా అభిమానులంతా రోడ్లమీద గడిపారు.
ఫైనల్లో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా లంక.. 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.