
మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 జరగనున్న నేపథ్యంలో.. అన్ని ఫ్రాంచైజీలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో తమకు ఏ క్రికెటర్ కావాలో.. ఏ క్రికెటర్ వద్దో అనే విషయంపై క్లారిటీ తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ముంబయి ఇండియన్స్ జట్టు.. శ్రీలంక మాజీ స్టార్ బౌలర్ లసిత్ మలింగను వదులుకుంది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది.
మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ఈరోజుతో గుడ్బై చెబుతున్నట్లు ఉద్వేగంతో పేర్కొంది. ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మలింగతో పాటు ఆసీస్కు చెందిన జేమ్స్ పాటిన్సన్, నాథన్ కౌల్టర్నీల్, మిచెల్ మెక్లీగన్లతో పాటు షెర్ఫన్ రూథర్ఫర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్ముఖ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా లసిత్ మలింగ గురించి ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చింది. 'మలింగ.. థ్యాంక్యూ ఫర్ ఎవర్.. నీలాంటి ఆటగాడు 12 ఏళ్లు మా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్ను వదులుకున్నా..నీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. మిస్ యూ లాట్.. మలింగ. మలింగతో పాటు మేము వదులుకున్న ఆటగాళల్లందరికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్పటికి ఒక భాగంగా ఉంటారంటూ' కామెంట్స్ జత చేసింది.