
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా పై దాడి కేసులో ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్ ను ముంబై పోలీసులు కస్టడీకి తరలించారు. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదనే కారణంతో షా పై సప్నాతో పాటు తన మిత్రబృందం కర్రలతో దాడి చేసిన విషయం తెలసిందే. ముంబైలోని విలే పార్లే ఈస్ట్లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో పృథ్వీ షాని సెల్ఫీ ఇవ్వాలని కోరగా అందుకు అతడు నిరాకరించగా వాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డ విషయం తెలిసందే. ఈ కేసులో అతడి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సప్నను అరెస్టు చేసిన పోలీసులు నేడు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా స్థానిక (ముంబై) కోర్టు సప్నాను నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఈనెల 20 దాకా ఆమె కస్టడీలోనే ఉండనుంది. అసలు పృథ్వీ షా మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది..? కర్రలతో ఎందుకు వచ్చారు..? వంటి విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారు.
ఎవరీ సప్న..?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న సప్న స్వస్థలం చండీగఢ్. ఆమె మోడలింగ్ లో రాణిస్తూనే ఇన్స్టాలో రీల్స్, ఫోటో షూట్లతో ఫేమస్ అయింది. భారత్ లో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న భోజ్పురి సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిగా రాణిస్తోంది. భోజ్పురిలో పలు సినిమాలు కూడా చేసిన సప్నకు కాశీ అమర్నాథ్, నిర్హువ చలల్ లండన్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. 2021లో ఆమె నటించిన ‘మేరా వతన్’ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది.
గోరఖ్పూర్ ఎంపీ, అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా విలన్ రవిశంకర్ నటించిన భోజ్పురి సినిమాలో సప్న హీరోయిన్ గా చేసింది. రవిశంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాశీ అమర్నాథ్’సినిమాలో సప్న కీలక పాత్ర పోషించింది.
ఇక ఇన్స్టాలో 2.24 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన గిల్.. వీడియోలు, పొట్టి డ్రెస్సులతో చేసే ఫోటో షూట్లతో పాపులారిటీని దక్కించుకుంది. దీంతోనే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కేటగిరీలో చోటు దక్కించుకుంది.