ఒకప్పుడు కీపింగ్లో లోపాలతో పాటు బ్యాటింగ్లోనూ తడబడిన యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం దూసుకెళ్తున్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్ నుంచి భీకరఫామ్లో ఉన్న పంత్ ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు
ఒకప్పుడు కీపింగ్లో లోపాలతో పాటు బ్యాటింగ్లోనూ తడబడిన యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం దూసుకెళ్తున్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్ నుంచి భీకరఫామ్లో ఉన్న పంత్ ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
ముఖ్యంగా మొతేరాలో జరిగిన చివరి టెస్టులో అంతటి ఒత్తిడిలోనూ సంయమనం పాటించి అద్భుత సెంచరీతో ( 101 పరుగులు) మ్యాచ్, సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
తాజాగా ఇంగ్లండ్తో 5 టీ20ల సిరీస్కు సిద్ధమవుతున్న పంత్ ఆ తర్వాత నెలరోజుల వ్యవధిలోనే ఐపీఎల్ 14వ సీజన్లో అడుగుపెట్టనున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభమై నాటి నుంచి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రిషబ్ పంత్ 68 మ్యాచ్ల్లో 2వేల పరుగులు సాధించాడు.
తాజాగా ఇంగ్లండ్ టీ20 స్టార్ సామ్ బిల్లింగ్స్ పంత్తో తనకు జరిగిన మొదటి పరిచయాన్ని ఓ ఇంటర్య్వూలో మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాను పంత్ను మొదటిసారి 2016 ఐపీఎల్లో కలిశానని, ఇద్దరం కలిసి రెండేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడామని చెప్పాడు.
అండర్ 19 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న పంత్ అదే దూకుడుతో ఐపీఎల్లో అప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ఎంపికయ్యాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో నాథర్ కౌల్టర్నీల్, క్రిస్ మోరిస్, కగిసో రబడ వంటి పేసర్లు వేసిన బౌలింగ్ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు.
దీనిని గమనించిన తాను మెంటార్ రాహుల్ ద్రవిడ్వైపు తిరిగి.. ఎవరీ కుర్రాడు.. కుమ్మేస్తున్నాడు'' అని అడిగానని బిల్లింగ్స్ గుర్తుచేసుకున్నాడు. అయితే 2017లో ధోని స్థానాన్ని ఆక్రమించే అర్హత పంత్కు మాత్రమే ఉందని చెప్పడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది.
కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సామ్ బిల్లింగ్స్ ఇంగ్లండ్ తరపున 21 వన్డేల్లో 586 పరుగులు, 30 టీ20ల్లో 391 పరుగులు చేశాడు. టీ20 స్పెషలిస్ట్గా మారిన బిల్లింగ్స్ కెరీర్లో 2020 ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
కరోనాతో మ్యాచ్లు జరగకపోయినా.. ఇటు ఇంగ్లండ్ తరపున.. ఆ తర్వాత బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ తరపున అద్భుతంగా ఆడాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రూ.2 కోట్లకు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని దక్కించుకుంది.