హాఫ్ సెంచరీలు చేసుకున్న రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్... వెస్టిండీస్ బౌలర్లపై ప్రతాపం చూపిస్తున్న టీమిండియా...

లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ కోల్పోకుండా 121 పరుగులు చేసిన టీమిండియా... హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్...

Google News Follow Us

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 60 పరుగులు కూడా చేయలేకపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ బౌలర్లపై వీర విహారం చేస్తూ... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరును అందుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి, యశస్వి జైస్వాల్‌తో డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, రెండో టెస్టులో తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. 

బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ మధ్య ఇది వరుసగా రెండో సెంచరీ భాగస్వామ్యం... 

రోహిత్ శర్మ 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 56 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. 

ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ, ఓపెనర్‌గా 2 వేల టెస్టు పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 39 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు అందుకుంటే రోహిత్ శర్మకు 40 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. 

సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ 43 ఇన్నింగ్స్‌ల్లో, శిఖర్ ధావన్ 47, మురళీ విజయ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధు 48 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల టెస్టు పరుగులు పూర్తి చేసుకోగా కెఎల్ రాహుల్ ఏకంగా 55 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు..

49 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ అందుకునేందుకు 140కి పైగా బంతులు వాడుకున్న యశస్వి జైస్వాల్, రెండో టెస్టులో తన ఐపీఎల్ స్టైల్‌ బ్యాటింగ్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఆరో జోడీగా రికార్డు క్రియేట్ చేశారు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్. వీరేంద్ర సెహ్వాగ్ - మురళీ విజయ్ కలిసి వరసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నారు.. 

లంచ్ బ్రేక్‌కి ముందు జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో అతనజే జారవిడిచాడు. దీంతో యశస్వి జైస్వాల్ లైఫ్ దక్కింది. 

Read more Articles on