
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నది. ఇంగ్లాండ్ ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సాఫీగా ఛేదించింది. ఈ క్రమంలో ఇండియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లీ వేసిన ఓ బంతిని పుల్ షాట్ ఆడాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఈ క్రమంలో ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ పాపకు బలంగా తాకింది. దాంతో ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది.
విల్లీ వేసిన బంతిని పుల్ షాట్ ఆడిన రోహిత్ తర్వాత బంతిని ఎదుర్కోబోతుండగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ఈ విషయాన్ని తన సహచరులకు చెప్పాడు. హిట్ మ్యాన్ దగ్గరికి బెయిర్ స్టో వచ్చి పాపకు గాయమైన విషయాన్ని తెలిపాడు. దాంతో ఆ పాప పట్ల రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కొద్దిసేపు మ్యచ్ ను ఆపారు.
ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ పాప దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై సమాచారం తెలియరాలేదు. అయితే ట్విటర్ లో మాత్రం ఓ అభిమాని.. ఆ పాప పేరు మీరా సాల్వి అని, ఆమె ప్రస్తుతం బాగానే ఉందని ఫోటోతో పాటు పోస్ట్ చేయడం గమనార్హం.
రోహిత్ - ధావన్ ల ఓపెనింగ్ రికార్డు :
టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించారు. నేటి మ్యాచ్ లో వాళ్లు 6 పరుగులుపూర్తి కాగానే వన్డేలలో ఈ ఇద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 5 వేల పరగులు దాటింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు వేల పరుగులు చేసిన ఓపెనర్ల జాబితాలో ఈ జంట నాలుగోది కావడం గమనార్హం. వీరి కంటే ముందు సచిన్-గంగూలీ (6,609) గిల్ క్రిస్ట్ - హెడెన్ (5,372), హేన్స్-గ్రీనిడ్జ్ (5,150) లు ఉన్నారు. ఆ తర్వాత జాబితాలో ధావన్-రోహిత్ (5,110) లు నాలుగో స్థానంలో నిలిచారు. ఇది ఈఇద్దరికీ 18వసెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.