
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన భారత జట్టుకి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి మెరుపు ఆరంభం అందించారు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టెస్టు కెరీర్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
25 పరుగుల వద్ద గ్యాబ్రియల్, 29 పరుగుల వద్ద మెక్కెంజీ క్యాచులు డ్రాప్ చేయడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ.. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో వరుసగా 30వ సారి డబుల్ డిజిట్ స్కోరు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు..
ఇంతకుముందు మహేళ జయవర్థనే 29 సార్లు టెస్టుల్లో డబుల్ డిజిట్ స్కోరు అందుకోగా రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. తొలి వికెట్కి 98 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. గ్యాబ్రియల్ బౌలింగ్లో అల్జెరీ జోసఫ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ..
రోహిత్ అవుటైన తర్వాత రెండో బంతికే వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. వెంటనే లంచ్ బ్రేక్ తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 12 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 98 పరుగులు చేసిన టీమిండియా, వెస్టిండీస్పైన 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
లంచ్ బ్రేక్ తర్వాత వర్షం తగ్గడానే బ్యాటింగ్కి వచ్చే టీమిండియా రెండో సెషన్లో బ్యాటింగ్ చేసి.. వెస్టిండీస్కి 350+ పరుగుల టార్గెట్ ఇచ్చి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయొచ్చు.