అంపైర్లపై అసహనం: పోలార్డ్ మ్యాచ్ ఫీజులో కోత

By telugu teamFirst Published May 13, 2019, 11:05 AM IST
Highlights

క్రీజ్‌కు దూరంగా ఆ రెండు బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు ఆగ్రహం వచ్చింది. అగ్రహాన్ని నిలువరించుకోలేక పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు.

హైదరాబాద్: ఆదివారం జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచులో అంపైర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పోలార్డ్ కు జరిమానా పడింది. అతని మ్యాచు ఫీజులో 25 శాతం కోత విధించారు. చెన్నైతో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్ల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో పోలార్డ్ 41 పరుగులు చేసి కీలకమైన భూమికను ఫోషించాడు. కాగా, చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో వేసిన చివరి ఓవర్‌లో వరుసగా రెండు బంతులు ట్రామ్‌లైన్స్‌ దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు అతను ప్రయత్నించాడు. రెండో బంతి కూడా దూరంగా వెళ్లడంతో వైడ్‌గా భావించి వదిలేశాడు. 

క్రీజ్‌కు దూరంగా ఆ రెండు బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు ఆగ్రహం వచ్చింది. అగ్రహాన్ని నిలువరించుకోలేక పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో సన్నద్ధమవుతుండగా అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. 

పొలార్డ్‌ వికెట్ల నుంచి పూర్తిగా పక్కకు జరగడంతో బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. క్రీజ్‌ నుంచి బయటకు వచ్చి పోలార్డ్‌ అసహనం ప్రకటించడంతో బిత్తరపోయిన ఇద్దరు అంపైర్లు అతని వద్దకు వచ్చి సముదాయించారు.

click me!