
ఎమ్మెస్ ధోనీ... క్రికెట్ వరల్డ్లోనే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలోనూ ఓ తిరుగులేని సూపర్ స్టార్. జులపాల జట్టుతో ఎంట్రీ ఇచ్చిన మాహీ, ఆ తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్తో కనిపించాడు. తాజాగా నెరిసిన జట్టు, తెల్ల మీసాలతో షాకింగ్ లుక్లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ తీసుకొచ్చిన జులపాల జట్టు ట్రెండ్ను బాలీవుడ్తో పాటు టాలీవుడ్ హీరోలందరూ ఫాలో అవ్వాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2022 సీజన్ లేటెస్ట్ ప్రోమోలో వయసు పెరిగినా, క్రికెట్పై ప్రేమ తగ్గని ముసలోడిగా కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ప్రోమో కూడా మాహీ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు రిలీజైన ఐపీఎల్ 2022 సీజన్ ప్రోమోలో బస్పు డ్రైవర్గా కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, గత సీజన్లో పూర్తి గుండుతో బౌద్ధ భిక్షువుగా, రాక్ స్టార్గా వివిధ గెటపుల్లో కనిపించి, కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే...
ఐపీఎల్ 2022 సీజన్కి సంబంధించన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ సీజన్ 15, మే 29న ఫైనల్తో ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కత్తా నైట్రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది...
మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి... గుజరాత్ లయన్స్ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలబడుతుంటే, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్తో తలబడనుంది... మే 22న సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్తో లీగ్ మ్యాచులు ముగిస్తాయి...
కరోనా వల్ల రెండేళ్లుగా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించిన బీసీసీఐ, ఈసారి మాత్రం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది. 2022 ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచులకు 25 శాతం మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించాలని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి 50 శాతం నుంచి 75 శాతం వరకూ జనాలను అనుమతించాలని భావిస్తోంది బీసీసీఐ...
అలాగే ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ. ఇంతకుముందు 150 సెకన్ల పాటు (రెండున్నర నిమిషాలు) స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ రూపంలో ఆటకు బ్రేక్ లభించేది. ఇప్పుడు దాన్ని మూడు నిమిషాలకు (180 సెకన్లు) నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం...
10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోయే ఐపీఎల్ 2022 సీజన్... మార్చి 26న మొదలుకానుంది. దాదాపు రెండున్నర నెలల పాటు సుదీర్ఘంగా సాగే 15వ సీజన్, మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది... ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచులన్నీ మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లో నిర్వహించబోతోంది బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచుల సన్నాహకాల కోసం మార్చి 8 నాటి కల్లా ముంబై చేరుకుని, క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఫ్రాంఛైజీలకు ఇప్పటికే సూచించింది భారత క్రికెట్ బోర్డు...