
ఐపీఎల్ 2019 సీజన్లో మన్కడింగ్ వివాదం పెద్ద దుమారమే రేపింది. పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించిన భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడంపై పెద్ద చర్చే జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని క్రికెట్ ఫ్యాన్స్తో పాటు చాలామంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు...
రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీ కోల్పోవడానికి ఈ వివాదం కూడా ఓ రకంగా కారణమైంది. తాజాగా ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ టోర్నీని మన్కడింగ్ వివాదం చుట్టుముట్టింది. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో మొదటిసారి పాల్గొంటున్న ఉగాండా జట్టు బౌలర్, పపువా న్యూ గినియా బ్యాట్స్మెన్ను ఈ విధంగా అవుట్ చేయడంతో మరోసారి ‘మన్కడింగ్’ గురించి చర్చ మొదలైంది...
అండర్-19 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండా జట్టు 28 ఓవర్లలో 123 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వికెట్ కీపర్ సైరస్ కకురు 59 బంతుల్లో 11 ఫోర్లతో 65 పరుగులు చేయగా కెప్టెన్ పస్కల్ మురుంగి 16 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు.
పపువా న్యూ గినియా బౌలర్ జాన్ కరికో 9 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 124 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పపువా న్యూ గినియా 19.3 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఉగాండా అండర్-19 జట్టుకి 35 పరుగుల తేడాతో విజయం దక్కింది. పపువా న్యూ గినియా జట్టులో జూనియర్ మోరియా 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 26 పరుగులు చేయగా, పీటర్ కరొహో 12, బయో రాయ్ 18 పరుగులు చేశారు...
జాన్ కరికో క్రీజులోకి వచ్చిన తర్వాత బౌలింగ్కి వచ్చిన ఉగాండా బౌలర్ జోసఫ్ బగుమా... జాన్ కరికోని మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. జాన్ కరికో క్రీజు వదిలి ముందుకు వెళ్లడాన్ని గమనించి, బౌలింగ్ చేయడం ఆపేసి వికెట్లను గిరాటేసి అప్పీలు చేశాడు. దీంతో అంపైర్ వెంటనే అవుట్గా ప్రకటించాడు...
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిది ఐసీసీ. ఈ పోస్టుపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... ‘ఇది కచ్ఛితంగా చెత్తాట...’ అంటూ కామెంట్ చేశాడు... అయితే సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ మాత్రం ఇందులో ఎలాంటి తప్పులేదంటూ కామెంట్ చేశాడు...
‘బౌలర్ బంతి వేయడానికి ముందు బ్యాట్స్మెన్ క్రీజు వదిలి ముందుకు వెళితే, ఇలా అవుట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. బౌలర్లు గీత దాటి ముందుకు వచ్చి బౌలింగ్ చేస్తే వారికి నో బాల్ రూపంలో పెనాల్టీ పడుతుంది, బ్యాట్స్మెన్కి ఫ్రీ హిట్ ఇస్తారు. అలాంటప్పుడు బ్యాట్స్మెన్ కూడా క్రీజులోనే ఉండాలి కదా...’ అంటూ కామెంట్ చేశాడు షంసీ...