మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు కిరణ మోరే, వెంగ్ సర్కార్ లు స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ప్రస్తుత సెలెక్టర్లు ఏం చేయాలో ఓ సలహా ఇచ్చారు.
మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న అంశం. ప్రపంచ కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటన వుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ టోర్నీ ముగిసి వారంరోజులు కావస్తున్న ధోని నుండి గానీ...బిసిసిఐ నుండి గానీ ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ధోని తన అంతర్జాతీయ కెరీర్ ను కంటిన్యూ చేస్తాడా...లేదా అన్నదానిపై అభిమానుల్లో డైలమాలో ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీప్ సెలెక్టర్లు ఈ విషయం స్పందించారు.
కిరణ్ మోరే ఏమన్నారంటే
టీమిండియా సీనియర్ ప్లేయర్ ధోని అంతర్జాతీయ కెరీర్ పై అతడే స్పష్టతనివ్వాల్సి వుంటుందని మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే అన్నారు. అప్పటివరకు అతడి మనసులో ఏముంందో ఎవ్వరం చెప్పలేమని అన్నారు. అయితే ధోని భవిష్యత్ ప్రణాళికలు, అతడి కెరీర్ కొనసాగింపై సెలెక్టర్లకు కూడా ఓ క్లారిటీ వుండాలి. అప్పుడే అతడు టీమిండియాకు ఏ మేరకు ఉపయోగపడతాడో తెలిసేది. కాబట్టి ప్రస్తుత సెలెక్షన్ కమిటీ కాస్త చొరవ తీసుకుని ధోని నుండే ఈ వివరాలను సేకరించాలని మోరే సూచించారు.
అంతేకాకుండా ప్రస్తుత సెలెక్టర్లకు ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ స్పష్టమైన అవగాహన వుండి వుంటుంది. కాబట్టి 2023 ప్రపంచ కప్ ను దృష్టిలో వుంచుకుని జట్టు ఎంపిక జరగాలి. నిరూపించుకునేందుకు సిద్దంగా వున్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించాలని సూచించాడు. అందువల్ల సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా తదుపరి నాలుగేళ్లలో ఆటగాళ్ల ప్రదర్శనే కొలమానంగా ఎంపిక జరగాలని మోరే సూచించారు.
వెంగ్ సర్కార్ స్పందన
ఇక మరో మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ అయితే ప్రస్తుతం ఆటగాళ్లకు కాదు సెలెక్టర్ల కు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలన్నాడు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల ఎంపిక జరగాలని అన్నారు. జట్టు ఎంత పటిష్టంగా వుంటుందో రిజర్వ్ బెంచ్ కూడా అంతే పటిష్టంగా వుండేలా చూసుకునే బాధ్యత సెలెక్టర్లదేనని పేర్కొన్నారు. అందువల్ల సీనియారిటీ ప్రకారం కాకుండా ప్రతిభే కొలమానంగా ఆటగాళ్ల ఎంపిక జరగాలని వెంగ్ సర్కార్ సలహా ఇచ్చారు.