నికోలస్ పూరన్ అద్భుత హాఫ్ సెంచరీ...
మెరుపులు మెరిపించిన క్రిస్ గేల్... మ్యాక్స్వెల్ మంచి ఇన్నింగ్స్... రబాడాకి రెండు వికెట్లు...
గత మ్యాచ్లో డబుల్ సూపర్ ఓవర్ విక్టరీ ఇచ్చిన నూతన ఉత్సాహంతో సీజన్లో తొలిసారిగా రెండు వరుస మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెఎల్ రాహుల్ వికెట్ను త్వరగా కోల్పోయింది.
సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ 15 పరుగులకే అవుట్ కాగా... క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసిన క్రిస్ గేల్ను అశ్విన్ అవుట్ చేశాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే మయాంక్ అగర్వాల్ రనౌట్ కావడంతో 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే నికోలస్ పూరన్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి పూరన్ అవుట్ కాగా, 24 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేశాడు మ్యాక్స్వెల్.
పూరన్, గేల్ ఇన్నింగ్స్ల కారణంగా చేయాల్సిన రన్రేట్ భారీగా పడిపోవడంతో దీపక్ హుడా, జేమ్స్ నిషమ్ కలిసి ఈజీగా ఇన్నింగ్స్ ముగించారు. ఈ విజయంతో నాలుగో విజయం అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.