
కొద్దిరోజులుగా భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు దారితీసిన టీమిండియా వన్డే కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈసారి మరో విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు అతడు ముంబైలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తున్నది.
మూడు రోజుల క్రితం జరిపిన ప్రిలిమినరీ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ ఫిట్ గానే ఉన్నట్టే తేలిందని వార్తలు వచ్చాయి. సోమవారం నాడు అతడికి పూర్తి స్థాయి ఫిట్నెస్ నిర్వహించిన తర్వాత గానీ ఏ విషయం చెప్పలేమని బీసీసీఐ వర్గాలు గతంలోనే తెలిపాయి. అయితే నిన్న నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పూర్తిగా ఫిట్ గా లేడని తేలినట్టు సమాచారం.
దీంతో సెలెక్టర్లు.. ప్రస్తుతం టీ20తో పాటు సౌతాఫ్రికా టెస్టు సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ ను దక్షిణాఫ్రికా తో జరుగబోయే వన్డే జట్టుకు సారథిగా ఎంపిక చేసేందుకు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే భవిష్యత్ కెప్టెన్ గా భావిస్తున్న రాహుల్ కు దక్షిణాఫ్రికా సిరీస్ తోనే తొలి సవాల్ ఎదురుకానుండటం గమనార్హం.
Also Read: Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆస్పత్రిలో చేరిన దాదా
ఇదిలాఉండగా.. రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడం, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా బారిన పడటంతో సౌతాఫ్రికా వన్డే జట్టు ఎంపిక కూడా ఆలస్యం కానున్నట్టు వినికిడి. ముందుగా వచ్చిన సమాచారం మేరకు.. నేడో లేదా రేపో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై అనుమానాలతో డిసెంబర్ 30 లేదా 31 న సెలెక్టర్లు సమావేశమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ముగిసిన తర్వాతే టీమ్ సెలెక్షన్ మీటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 30 లేదా 31 న అనుకుంటున్నాం. బీసీసీఐ దీనిపై తుది వివరాలు వెల్లడిస్తుంది..’ అని తెలిపాడు.