
సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యకు కోపమొచ్చింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడించి, ఆతర్వాత బ్యాటింగ్ లో కూడా రాహుల్ త్రిపాఠి రఫ్ఫాడించినా ఆమెకు సంతోషం దక్కలేదు. హైదరాబాద్ గెలిచినా ఆమె కెమెరామెన్ పై చిందులు తొక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కావ్య మ్యాచ్ లు చూడటానికి వస్తే దాదాపు కెమెరాలన్నీ ఆమె మీదే ఉంటాయి. సన్ రైజర్స్ బౌలర్లు వికెట్లు తీసినా బౌండరీలు గానీ సిక్సర్లు గానీ బాదినా ఆమె ఆనందంతో కేరింతలు కొడుతూ గంతెస్తుంది.
అయితే పంజాబ్ తో మ్యాచ్ కంట ముందు గడిచిన రెండు మ్యాచ్ లలో మాత్రం హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శన పేలవంగా ఉండటంతో.. మ్యాచ్ లను చూడటానికి వచ్చిన ఆమె ఫేస్ కూడా డీలా పడిపోయినట్టుగా ఉండేది. కానీ నిన్న మాత్రం మనోళ్లు ఇరగదీశారు. పంజాబ్ బ్యాటర్ల వికెట్లు అలా వచ్చి ఇలా పోతుంటే కావ్య ఫుల్ ఖుషీ అయింది. కానీ ఇన్నింగ్స్ చివర్లో ఆమెకు కోపమొచ్చింది.
అసలేం జరిగిందంటే..
భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో అంపైర్ ఇచ్చిన వైడ్ కు ఎస్ఆర్హెచ్ కు రివ్యూ కోరింది. ఈ క్రమంలో కెమెరాలు ఆటగాళ్లను కాకుండా కావ్య వైపునకు తిరిగాయి. టీవీ స్క్రీన్ల మీద ఆమె కనిపించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. ‘హట్ రే’ అని అరుస్తూ కెమెరామెన్ వైపు కోపంగా చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఇటీవలే కెమెరామెన్ పైన కస్సు బుస్సులాడిన విషయం తెలిసిందే. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా కెమెరామెన్.. డీఆర్ఎస్ కు సంబంధించిన విజువల్స్ చూపకుండా కెప్టెన్ ను కవర్ చేస్తూ క్లోజప్ పెట్టాడు. దీంతో హిట్మ్యాన్.. ‘అరె నన్నేం చూపిస్తావురా.. నా ముఖంలో ఏముంది’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంలో రోహిత్ వెనుకే ఉన్న టీమ్ మెంబర్స్ విరగబడి నవ్వారు.
కాగా హైదరాబాద్ - పంజాబ్ మ్యాచ్ లో సారథి ధావన్ తప్ప మిగిలినవారు తేలిపోవడంతో రెండు విజయాల తర్వాత పంజాబ్ కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగా లక్ష్యాన్ని హైదరాబాద్.. 17.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.