
ఐపీఎల్ 2023 సీజన్లో మొదటి 8 మ్యాచుల్లో 6 పరాజయాలు చవిచూసింది ఢిల్లీ క్యాపిటల్స్. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. మహ్మద్ షమీ మ్యాజిక్ స్పెల్తో 4 వికెట్లు తీయడంతో 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ 49 ఆలౌట్ రికార్డును బ్రేక్ చేసేలా కనిపించింది..
అయితే ఆమన్ హకీం ఖాన్, అక్షర్ పటేల్ కలిసి పోరాడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగుల స్కోరు చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి ఇన్నింగ్స్ మొదటి బంతికే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్, డేవిడ్ మిల్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఈ సీజన్లో పంజాబ్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ ఖాన్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటైన మూడో బ్యాటర్గా నిలిచాడు ఫిలిప్ సాల్ట్.
2 బంతుల్లో 2 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. 6 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన రిలే రసో, మహ్మద్ షమీ బౌలింగ్లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 1 పరుగు చేసిన మనీశ్ పాండే కూడా షమీ బౌలింగ్లో సాహాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
14 బంతుల్లో 10 పరుగులు చేసిన ప్రియమ్ గార్గ్ కూడా షమీ బౌలింగ్లో సాహాకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుసగా మూడు వికెట్లు కూడా షమీ బౌలింగ్లో వికెట్ కీపర్ సాహాకే క్యాచ్ ఇచ్చి పడడం విశేషం.
11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, గుజరాత్ టైటాన్స్ తరుపున ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. గత సీజన్లో రషీద్ ఖాన్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఇంతకుముందు టైటాన్స్ తరుపున బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఆ రికార్డును షమీ అధిగమించాడు..
23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ని అక్షర్ పటేల్, ఆమన్ హకీం ఖాన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 27 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు..
73 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏడో వికెట్కి రిపల్ పటేల్, ఆమన్ హకీం ఖాన్ కలిసి 26 బంతుల్లో 53 పరుగులు జోడించారు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన ఆమన్ హాకీం ఖాన్, రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు..
ఐదో వికెట్ పడిన తర్వాత ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్లో రెండు 50 భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 23 పరుగులు చేసి మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు.
మోహిత్ శర్మకు ఇది ఐపీఎల్ కెరీర్లో 100వ వికెట్.