
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గత కొంతకాలంగా ఫామ్ లో లేకున్నా అతడి క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. గతంలో మాదిరిగా భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్న ఈ బెంగళూరు మాజీ సారథి.. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో మొదటి మ్యాచులో తప్ప మిగిలిన రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ముగిశాక అతడు ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ కు బ్యాటింగ్ టిప్స్ ఇస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించి ఫోటోలను కూడా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోపై ట్విట్టర్ లో మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ... ‘ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు మీకు సంతోషాన్ని పంచుతాయి..’ అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో కోహ్లి.. బట్లర్ కు బ్యాటింగ్ టిప్స్ ఇస్తూ కనిపించాడు.
ఇప్పుడు ఈ ఫోటోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ... ‘బట్లర్ కు కోహ్లి బ్యాటింగ్ టిప్స్ ఇస్తున్నాడా..? ఇదేం విడ్డూరం. అసలైతే విరాట్ కు కదా టిప్స్ కావాల్సింది..’, ‘ఖతం బట్లర్ పనైపోయింది.. అతడు నెక్స్ట్ మ్యాచ్ లో 7 పరుగుల కంటే ఎక్కువ చేయడు..’, ‘తర్వాత మ్యాచులో బట్లర్ పది పరుగులు చేస్తే గొప్ప...’ ‘బట్లర్ కు కోహ్లి టిప్స్ ఇస్తున్నాడా..? అంతే. ఇక బట్లర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే...’ అని రాసుకొచ్చారు. మరికొంతమంది ఫన్నీ మీమ్స్ తో నవ్వులు పూయించారు.
ఇదిలాఉండగా.. తాను ఆడిన మూడు మ్యాచులలో బట్లర్ 205 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో 66 బంతుల్లో సెంచరీ చేసిన బట్లర్.. బెంగళూరుతో మ్యాచులో కూడా ఆఖరివరకు క్రీజులో ఉండి.. 47 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
ఇక నిన్నటి మ్యాచులో రాజస్థాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఛేదనలో ఆ జట్టుకు శుభారంభమే దక్కినా... మిడిలార్డర్ తడబడింది. భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లి.. 5 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. కానీ చివర్లో వచ్చిన షాబాజ్ అహ్మద్ (45), దినేశ్ కార్తీక్ (44 నాటౌట్) లు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. ఈ సీజన్ లో 3 మ్యాచులాడిన ఆర్సీబీకి ఇది రెండో విజయం కాగా.. అన్నే మ్యాచులాడిన రాజస్థాన్ కు తొలి పరాజయం.