
ఐపీఎల్-2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచులో ఇరు జట్ల సారథులు అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ సారథి మయాంక్ అగర్వాల్ టీ20లలో 4వేల పరుగులు పూర్తి చేసుకోగా.. హిట్ మ్యాన్ ఐపీఎల్ లో 500 బౌండరీలు బాదిన ఆటగాళ్లలో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో క్రికెటర్ అయ్యాడు.
ముంబైతో మ్యాచులో పంజాబ్ సారథి మయాంక్.. 32 బంతుల్లోనే 52 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో అతడు వ్యక్తిగత స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా టీ20లలో 4 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. మయాంక్ టీ20లలో ఈ మార్క్ ను అందుకోవడానికి 164 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.
తొలి వెయ్యి పరుగుల కోసం 45 ఇన్నింగ్స్ తీసుకున్న మయాంక్.. రెండో వెయ్యి కోసం 42 ఇన్నింగ్స్.. మూడో వెయ్యి కోసం 45 ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నాలుగో వెయ్యి పరుగుల మార్కును అందుకోవడానికి మాత్రం 32 ఇన్నింగ్స్ మాత్రమే అవసరమయ్యాయి. కాగా ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ కు ఐపీఎల్ లో ఇది 12వ హాఫ్ సెంచరీ.
పదివేల పరుగుల క్లబ్ లో రోహిత్..
ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద రోహిత్ పదివేల పరుగుల మార్కును అందుకున్నాడు. టీ20లలో ఈ ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్ హిట్ మ్యాన్. పంజాబ్ తో మ్యాచ్ లో రబాడా వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతికి సిక్సర్ కొట్టగానే హిట్ మ్యాన్ ఈ మైల్ స్టోన్ ను అందుకున్నాడు.
టీ20లో 10వేల పరుగుల ఆటగాళ్లు :
- క్రిస్ గేల్ : 14,562 పరుగులు
- షోయబ్ మాలిక్ : 11,698
- కీరన్ పొలార్డ్ : 11,474
- ఆరోన్ ఫించ్ : 10,499
- విరాట్ కోహ్లి : 10,379
- డేవిడ్ వార్నర్ : 10,373
- రోహిత్ శర్మ : 10,003
ఐపీఎల్ లో 500 ఫోర్లు..
పంజాబ్ తో మ్యాచ్ లో రోహిత్ మరో మైల్ స్టోన్ కూడా చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ 3 బౌండరీలు బాదాడు. రబాడా బౌలింగ్ లో రెండో ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. దీంతో ఐపీఎల్ లో 500 ఫోర్లు కొట్టిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ లో అత్యధిక ఫోర్ల జాబితా :
- శిఖర్ ధావన్ : 668
- విరాట్ కోహ్లి : 554
- డేవిడ్ వార్నర్ : 515
- సురేశ్ రైనా : 506
- రోహిత్ శర్మ : 502