
గుజరాత్ టైటాన్స్ తో తలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో టాపార్డర్ విఫలమైనా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చెన్నైచేసిన స్కోరులో సగం రుతురాజ్ వే. అయితే గతేడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్.. ఈ సీజన్ లో కూడా అదే జోరు కొనసాగిస్తాడని ఆశించారు అభిమానులు. కానీ అతడు అనూహ్యంగా తొలి ఐదు మ్యాచులలో దారుణంగా విఫలమయ్యాడు. గుజరాత్ తో మ్యాచ్ కు ముందు రుతురాజ్ చేసిన స్కోర్లు వరుసగా.. 0, 1, 1, 16, 17.. (ఐదు మ్యాచుల్లో 35 పరుగులు). కానీ గుజరాత్ తో మ్యాచ్ లో 48 బంతుల్లో 73 రన్స్ చేశాడు గైక్వాడ్.
ఐపీఎల్ 2021.. అంతకుముందు సీజన్ (2020) లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 516 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. కానీ 2021 లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఐపీఎల్-14లో ముంబై ప్లే ఆఫ్ కు ముందు బెంగళూరుతో మ్యాచ్ ఆడింది. అప్పటివరకు అతడు పెద్దగా రాణించింది లేదు. ఆ మ్యాచ్ లో కూడా చేసినవి 12 బంతుల్లో 9 పరుగులే. అంతకుముందు కూడా.. 26, 6, 11, 14, 9.
కానీ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం... అతడు రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడాడు. అందులో 25 బంతుల్లోనే 50 పరుగులు. ఇక ఆ సీజన్ లో ఆఖరి మ్యాచ్ (ఎస్ఆర్హెచ్) లో అయితే 32 బంతులలోనే 84 పరుగులతో శివాలెత్తాడు.
కట్ చేస్తే.. ఈ ఇద్దరు ఆటగాళ్లు వరుసగా విఫలమవుతూ తర్వాత రాణించడానికి ఒక కారణముంది. ఆ కారణం పేరు విరాట్ కోహ్లి. అవును. వరుసగా విఫలమవుతూ నైరాశ్యంలో కూరుకుపోతుతన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఫామ్ అందుకోవడానికి కోహ్లియే కారణం.
ఐపీఎల్-2021లో ఆర్సీబీ తో మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ ముంబై డగౌట్ లో కూర్చుని ఏడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ గా మారింది. అయితే మ్యాచ్ అనంతరం అతడి దగ్గరికెళ్లిన కోహ్లి.. ఇషాన్ భుజాలపై చేయి వేసి ఈ యువ ఆటగాడిని ఓదార్చాడు. అతడిలో కాన్ఫిడెన్స్ పెంచాడు. కోహ్లి ఇచ్చిన బూస్ట్ తో ఇషాన్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దూకుడుగా ఆడి భారత జట్టులో కూడా స్థానం సంపాదించాడు.
ఇక ఇప్పుడు రుతురాజ్ వంతు. ఈ సీజన్ లో చెన్నై.. తమ ఐదో మ్యాచ్ ను ఆర్సీబీతో ఆడింది. ఆ మ్యాచ్ లో రుతురాజ్ చేసింది 17 పరగులే. ఇషాన్ కిషన్ మాదిరి డగౌట్ లో ఏడ్వకపోయినా రుతురాజ్ కూడా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. దీంతో కోహ్లి.. అతడి దగ్గరికెళ్లి మాట్లాడాడు. రుతురాజ్ చెప్పిందంతా విని.. అతడికి కొన్ని కీలక సూచనలు చేశాడు. అంతే.. గుజరాత్ తో మ్యాచ్ లో రుతురాజ్ బ్యాక్ ఆన్ ట్రాక్.
ఇదిలాఉండగా.. ఈ రెండు సందర్భాలను జోడిస్తూ.. ట్విట్టర్ లో అభిమానులు క్రెడిట్ కోహ్లికే దక్కాలని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తిరిగి ఫామ్ లోకి రావడానికి కోహ్లినే కారణమని చెబుతున్నారు. కాగా.. ఫామ్ కోల్పోయిన యువ ఆటగాళ్లకు కోహ్లి ధైర్యం చెప్పి వారిలో ఆత్మ విశ్వాసం నింపడం బాగానే ఉంది గానీ రెండేండ్లకు పైగా సెంచరీ లేక.. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి పై ఎవరు చేయి వేయాలో.. ఎవరి చేతి పడితే అతడు తిరిగి ఫామ్ లో వస్తాడో మరి...? అని అనుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.