స్వల్ప లక్ష్యఛేదనలో ఊహించని ట్విస్ట్... 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Dec 24, 2022, 4:28 PM IST
Highlights

37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్... విజయానికి 100 పరుగుల దూరంలో భారత్, 6 వికెట్ల దూరంలో బంగ్లాదేశ్.. 

145 పరుగుల ఈజీ టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోవడంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... ఫామ్‌లో శుబ్‌మన్ గిల్, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే పెవిలియన్ చేరారు... 

2 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌‌ని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 6 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా మెహిదీ హసన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...

వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చాడు. గిల్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ కూడా మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లోనే జాకీర్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. విరాట్ అవుట్ అయ్యే సమయానికి 3 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి బ్యాటింగ్‌కి పంపించింది భారత జట్టు.  జయ్‌దేవ్ ఉనద్కట్ 3 పరుగులు, అక్షర్ పటేల్ 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది భారత జట్టు. టీమిండియా విజయానికి సరిగ్గా 100 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి... నాలుగో రోజు మొదటి సెషన్‌లో టీమిండియా ఆటతీరు మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది.

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. తీవ్రంగా నిరాశపరిచాడు... ఆసియా కప్ 2022 టోర్నీలో టీ20 సెంచరీ, బంగ్లాతో వన్డే సిరీస్‌లో వన్డే సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ... టెస్టు సిరీస్‌లో టెస్టు శతకాన్ని అందుకుంటాడని ఆశించారు అభిమానులు. అయితే వారిని తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, రెండు సార్లు 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. 

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 7/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్ జట్టు 70.2 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం పోగా టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్‌ని పెట్టింది.. 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

click me!