
ఢిల్లీ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 13 పరుగులతో, కెఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు...
తొలి రోజు ఆఖరి ఓవర్లో నాథన్ లియాన్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయినట్టుగా ప్రకటించాడు అంపైర్. వెంటనే రోహిత్ డీఆర్ఎస్ తీసుకోవడం, టీవీ రిప్లైలో అతని బ్యాటుకి బంతి తగలలేదని తేలడంతో నాటౌట్గా నిలిచాడు. రెండో రోజు మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో చేసిన స్కోరుకి టీమిండియా ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తుందనేదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించుకుంది. తొలి ఇన్నింగ్స్లో 150+ పరుగుల ఆధిక్యం దక్కితే, మ్యాచ్పై పట్టు సాధించవచ్చు. అయితే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తొలి వికెట్కి ఎన్ని పరుగులు జోడిస్తారనే టీమిండియాకి చాలా కీలకం..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్లో 78.4 ఓవర్లలో 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
నాగ్పూర్ టెస్టు ఘోర పరాజయం నుంచి త్వరగానే పాఠం నేర్చుకున్న, ఢిల్లీ టెస్టులో మంచి స్కోరే చేసింది. తొలి టెస్టులో ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోతే, రెండో టెస్టులో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు నమోదు చేశారు..
ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఓపెనర్లు ఆచితూచి ఆడి శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా జాగ్రత్తగా ఆడుతూ తొలి వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 44 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ బౌలింగ్లో శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
25 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా డీఆర్ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది... అదే ఓవర్లో ఆఖరి బంతికి స్టీవ్ స్మిత్ని డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 2 బంతులాడిన స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు అనిల్ కుంబ్లే మాత్రమే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 111 వికెట్లు తీసి, అశ్విన్ కంటే ముందున్నాడు.
30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 12 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్ కలిసి ఐదో వికెట్కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 125 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 81 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రవీంద్ర జడేజా బౌలింగ్లో కెఎల్ రాహుల్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్కి పెవిలియన్ చేరాడు.. ఈ వికెట్తో టెస్టుల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు జడ్డూ. అలెక్స్ క్యారీ 5 బంతులాడి అశ్విన్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు...
ఈ దశలో ప్యాట్ కమ్మిన్స్, పీటర్ హ్యాండ్స్కోంబ్ కలిసి ఏడో వికెట్కి 59 పరుగులు జోడించారు. 59 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అదే ఓవర్లో ఆఖరి బంతికి టాడ్ ముర్ఫీని క్లీన్ బౌల్డ్ చేశాడు జడ్డూ...
26 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన నాథన్ లియాన్ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 68 పరుగుల వద్ద పీటర్ హ్యాండ్స్కోంబ్, జడేజా బౌలింగ్లో అశ్విన్కి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్గా తేలడంతో పెవిలియన్కి వెళ్తున్న ప్లేయర్లు తిరిగి గ్రౌండ్లోకి రావాల్సి వచ్చింది...
తొలి టెస్టు ఆడుతున్న కుహ్నెమన్ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కి తెరపడింది. 142 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్కోంబ్, నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కగా అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీశారు.