
దాయాదుల మధ్య సమరం ఎందుకు అంత రసవత్తరంగా ఉంటుందో చెప్పడానికి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ ఇరు దేశాల మధ్య మ్యాచ్ లకు ఉండే క్రేజ్ కు సజీవ సాక్ష్యం. ఈ మెగా పోరు తర్వాత మళ్లీ భారత్-పాక్ లు ఎప్పుడు తలపడతాయి..? అన్న ప్రశ్నకు బీసీసీఐ కార్యదర్శి జై షా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఆసియా కప్ లో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయని ఆయన ఖాయం చేశాడు. ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
ఆసియా కప్ - 2023 (వన్డే ఫార్మాట్) లో భాగంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాకిస్తాన్ తో పాటు క్వాలిఫయర్ ఓ గ్రూప్ లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లు మరో గ్రూప్ లో ఉన్నాయి.
ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ నిర్వహించబోయే షెడ్యూల్ వివరాలను ట్విటర్ లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా షా తన ట్వీట్ లో.. ‘2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తుంది...’అని పేర్కొన్నాడు. 2023తో పాటు 2024లో జరుగబోయే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) లో కూడా భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉండటం గమనార్హం. కానీ అప్పుడు ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.
వేదికపై రాని స్పష్టత..
ఏసీసీ రెండేండ్ల షెడ్యూల్ విడుదల చేసిన జై షా మరి ఈ ఏడాది ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం ప్రస్తావించలేదు. ట్వీట్ లో ఆయన షేర్ చేసిన సమాచారంలో కూడా ఇద లేదు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్తాన్ లో ఈ టోర్నీ జరిగితే టీమిండియా ఆ దేశానికి రాదని ఇప్పటికే జై షా ప్రకటన చేశారు. దానికి పాక్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఆసియా కప్ ఆడేందుకు మా దేశం రాకుంటే మేం వన్డే ప్రపంచకప్ కోసం ఇండియాకు వచ్చేది లేదని ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో జై షా ట్వీట్ చేయడం గమనార్హం. పాక్ కు వచ్చే ప్రసక్తే లేదని, తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్న బీసీసీఐ.. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.