
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంతవరకూ వరల్డ్ కప్ టోర్నీలలో విజయం దక్కని ఆ జట్టు.. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 లో పాకిస్థాన్ ను ఓడించి విజయదుందుభి మోగించింది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచులో బంగ్లా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. వన్డేలలో పాక్ పై బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. పాక్ కు ఇది నాలుగో ఓటమి. దీంతో ఆ జట్టు.. ప్రపంచకప్ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే..
హమిల్టన్ వేదికగా జరిగిన పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ 12వ గ్రూప్ మ్యాచులో టాస్ గెలిచిన బిస్మా మరూఫ్ (పాక్ కెప్టెన్) బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన బంగ్లాకు ఓపెనర్లు షమిమా సుల్తానా (30 బంతుల్లో 17), షర్మిన్ అక్తర్ (55 బంతుల్లో 44) లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 37 పరుగులు జోడించిన ఈ భాగస్వామ్యాన్ని నిదా విడదీసింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో అక్తర్ కూడా ఒమైమా సోహైల్ బౌలింగ్ లో బౌల్డ్ అయింది.
మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫర్గానా హక్ (115 బంతుల్లో 71), కెప్టెన్ నిగర్ సుల్తానా (64 బంతుల్లో 46) లు కలిసి ఆ జట్టుకు కీలక భాగస్వామ్యం జోడించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 95 పరుగులు చేశారు. అయితే వెంటవెంటనే ఈ ఇద్దరూ పెవిలియన్ కు చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. దీంతో బంగ్లా... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసింది.
235 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు నహిదా ఖాన్ (67 బంతుల్లో 43), సిద్ర అమిన్ (140 బంతుల్లో 104) లు శుభారంభం చేశారు. తొలి వికెట్ కు 91 పరుగులు జోడించారు. అంతగా అనుభవం లేని బంగ్లా బౌలింగ్ ను అలవోకగా ఆడారు. ఈ క్రమంలో సిద్ర అమిన్ సెంచరీ కూడా చేసింది. నహిదా నిష్క్రమించినా.. బిస్మా మరూఫ్ (31)తో కలిసి సిద్రా లక్ష్యం దిశగా సాగింది.
అప్పుడే మొదలైంది..
ఛేదన దిశగా సాఫీగా సాగుతున్న పాకిస్థాన్ కు అమిన్, బిస్మా లు త్వరత్వరగా నిష్క్రమించడంతో కష్టాలు మొదలయ్యాయి. బంగ్లా బౌలర్ ఫాతిమా ఖటూన్ వరుసబంతుల్లో అలియా రియాజ్, ఫాతిమా సనా లను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపింది. ఆ తర్వాత ఓవర్లోనే వికెట్ కీపర్ సిద్రా నవాజ్ ను కూడా రనౌట్ చేసింది. 41 వ ఓవర్ వరకు 183-3 పరుగులు చేసి విజయం దిశగా పయనిస్తున్న పాక్.. ఒక్కసారిగా 44 ఓవర్ ముగిసేసరికి 188-7 కు దిగజారింది. ఐదు పరుగుల తేడాతో ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖర్లో డయానా బేగ్ (12), నష్ర సంధు (9 నాటౌట్) లు పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. దీంతో బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో మూడు వికెట్లు తీసిన బంగ్లా బౌలర్ ఫాతిమా ఖటూన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.