ఇతనికి త్వరగా పెళ్లి చేసేయండి.. అప్పుడైనా బాధ్యతలు తెలిసొస్తాయి.. వైరల్ అవుతున్న గబ్బర్‌-జడ్డూల పోస్ట్

By Srinivas MFirst Published Sep 24, 2022, 2:13 PM IST
Highlights

Shikhar Dhawan - Ravindra Jadeja: టీమిండియా ఓపెనర్, వెటరన్ శిఖర్ ధావన్.. తన స్నేహితుడు, సహచర ఆటగాడు రవీంద్ర జడేజాతో కలిసి చేసిన ఓ రీల్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నది. 

టీమిండియాలో శిఖర్ ధావన్ ఒక  ఎనర్జీ బూస్టర్  వంటివాడు. గబ్బర్ ఎక్కడున్నా  ఫన్ గా ఉంటూ తన తోటివారిని నవ్విస్తూ ఉంటాడు.  తోటి ఆటగాళ్లతో నవ్వుతూ నవ్విస్తూ ఉండే ధావన్ కు  అంతే జోవియల్ గా ఉండే  రవీంద్ర జడేజా కలిస్తే ఇంకేమైనా ఉందా..? ఇక అక్కడ రచ్చ రచ్చే. తాజాగా అలాంటి ఘటనే  జరిగింది. ఇద్దరూ కలిసి ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ రీల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో జడ్డూ..‘ఇతడిని త్వరగా పెళ్లి చేసేయండి. అప్పుడైనా ఈ కుప్పిగంతులు మానేసి బాధ్యతగా ఉంటాడు..’ అని  తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

ఇన్స్టాగ్రామ్ వేదికగా  గబ్బర్, జడ్డూ లు ఈ వీడియోను తమ ఖాతాలలో పోస్ట్ చేశారు. జడేజా మోకాలి గాయానికి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంకా  బెడ్ మీదే ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్లిన గబ్బర్ .. జడ్డూతో కలిసి ఓ ఫన్నీ రీల్ చేశాడు. 

ఈ రీల్ లో జడేజా కాలిగాయమై కూర్చుంటే ధావన్ మాత్రం  పంబాబీ బాంగ్రా డాన్స్ చేస్తూ  ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు జడ్డూ.. ‘ఇతడికి త్వరగా పెళ్లి చేసేయండి. అప్పుడైనా బాధ్యతలు తెలిసొచ్చి ఈ కుప్పిగంతులు మానేసి బుద్దిగా పనిచేసుకుంటాడు..’ అంటూ ఫన్నీగా చెప్పాడు. 

ఇక ఈ వీడియోను గబ్బర్ షేర్ చేస్తూ.. ‘వామ్మో.. ఇప్పుడే వద్దు.. కొన్ని రోజులాగు..’ అని  కామెంట్ పెడుతూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నది. భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ మహ్మద్ లు కూడా  ఈ వీడియోను లైక్ చేయడమే గాక ఫన్నీ ఎమోజీలతో కామెంట్ కూడా చేయడం గమనార్హం.  

 

ఇదిలాఉండగా ధావన్ వైవాహిక జీవితం కాస్త ట్రాజెడీగానే ఉంది. 2012లో అతడు  అయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా సంతతి భారత మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా ధావన్ ఆమెను వివాహమాడాడు. ఈ ఇద్దరికీ  2014లో ఓ బాబు కూడా పుట్టాడు.  ఎనిమిదేండ్ల  తర్వాత ఈ కాపురంలో కలహాలతో ఈ ఇద్దరూ గతేడాది నుంచి విడివిడిగా ఉంటున్నారు.  ధావన్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. టీ20లలో అతడి పేరును పట్టించుకోని సెలక్టర్లు.. వన్డేలలో మాత్రం ఆడిస్తున్నారు. ఇటీవలే వెస్టిండీస్, జింబాబ్వేలలో ద్వితీయ శ్రేణి భారత జట్టుకు  ధావన్ సారథ్యం వహించాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్ కు కూడా ధావనే కెప్టెన్ గా ఉండనున్నాడు. 

జడేజా ఆసియా కప్ లో గాయపడి ఇటీవలే మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్న జడేజా.. త్వరలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కు దూరం కానున్నాడు. 

click me!