వేదిక మార్చేందుకు ఒప్పుకోని క్రికెట్ ఆస్ట్రేలియా...
క్వారంటైన్ నిబంధనల్లో చిన్న చిన్న సడలింపులు చేసిన ఆసీస్ క్రికెట్ బోర్డు..
హోటల్ చుట్టూ బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు...
ఆస్ట్రేలియా టూర్లో బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన నాలుగో టెస్టుపై నీలినీడలు తొలిగిపోయినట్టే అనిపిస్తోంది. జనవరి 15 నుంచి జరగాల్సిన ఈ టెస్టుకి ముందు టీమిండియా, ఆస్ట్రేలియా ప్లేయర్లు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఉండదని, కేవలం హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపింది.
అయితే సిరీస్ చివర్లో మళ్లీ క్వారంటైన్లో గడిపేందుకు భారత క్రికెట్ జట్టు అంగీకరించలేదు. అవసరమైతే వేదికను మరో నగరానికి మార్చాలంటూ డిమాండ్ చేసింది. ‘రూల్స్ ప్రకారం ఆడలేకపోతే, ఇక్కడికి రావద్దంటూ’ క్వీన్లాండ్స్ హెల్త్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు భారత జట్టు డిమాండ్లకు ఆసీస్ దిగొచ్చినట్టు సమాచారం.
వేదిక మార్చడానికి అంగీకరించని క్రికెట్ ఆస్ట్రేలియా... భారత జట్టు క్వారంటైన్ నిబంధనలను మాత్రం సడలించింది. చివరి టెస్టుకి ముందు ప్రాక్టీస్కి అనుమతి ఉండదు. అయితే ఇరు జట్ల క్రికెటర్లు బస చేసే హోటల్ చుట్టూ బయో బబుల్ ఏర్పాటు చేస్తారు.
బయో సెక్యూలర్ పరిధిలో తిరిగేందుకు, ఇతర క్రికెటర్లతో చర్చించేందుకు ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. సిరీస్ చివర్లో సమస్యను సాగదీయకుండా ఈ సడలింపులకి టీమిండియా అంగీకరించే అవకాశం ఉంది.