
ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు బీసీసీఐ వరుస షాకులతో బెంబేలెత్తిస్తున్నది. న్యూజిలాండ్ పర్యటనతో పాటు అంతకుముందు పలు సిరీస్ లలో విఫలమైన పంత్ ను బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు ముందు ఉన్నట్టుండి తప్పించింది. తొలి వన్డే ప్రారంభానికి కొద్దిసేపు ముందు పంత్ ను వైద్యుల సూచన మేరకు తప్పించామని చెప్పుకొచ్చింది బీసీసీఐ. అయితే సంజూ శాంసన్ ను కాదని పంత్ ను ఆడించడం.. అతడు న్యూజిలాండ్ టూర్ లో అట్టర్ ఫ్లాఫ్ కావడంతోనే బీసీసీఐ ఇలా చేసిందని వార్తలు వినిపించాయి.
తాజాగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐ మరో షాకిచ్చింది. అతడిని జట్టులో చోటిచ్చినా వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పుడు భారత జట్టు కెఎల్ రాహుల్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పినప్పుడల్లా రిషభ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పుతున్నది. ఇంగ్లాండ్ తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడు కూడా పంత్ కే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.
కానీ బంగ్లాతో త్వరలో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ లో మాత్రం పంత్ ను పక్కనబెట్టింది బీసీసీఐ. అతడి స్థానంలో ఛతేశ్వర్ పుజారాను కెఎల్ రాహుల్ కు డిప్యూటీగా నియమించింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో రాహుల్ ను కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. బీసీసీఐ తాజా నిర్ణయంతో పంత్ జోరుకు బ్రేకులు పడ్డట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బంగ్లాతో సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించింది. రోహిత్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తప్పుకోవడంతో కొత్త జట్టు వివరాలను వెల్లడించింది. గాయాల కారణంగా తప్పుకున్న షమీ, జడేజా ల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ లు జట్టుతో చేరారు. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ను తీసుకుంది.
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కు భారత జట్టు : శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయాస్ అయ్యర్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ