
తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. పసికూన హాంకాంగ్ మీద రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ (57 బంతుల్లో 78 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్), ఫకర్ జమాన్ (41 బంతుల్లో 53, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు భారీ స్కోరు అందించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. చివర్లో ఖుష్దిల్ (15 బంతుల్లో 35 నాటౌట్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్.. 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆసియా కప్-2022లో పాక్ కు షాకిచ్చి సూపర్-4కు అర్హత సాధించాలంటే హాంకాంగ్ కు 20 ఓవర్లలో 194 చేయాలి..
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ మూడో ఓవర్లోనే ఆ జట్టు ప్రధాన బ్యాటర్ బాబర్ ఆజమ్ (9) వికెట్ ను కోల్పోయింది. ఆజమ్ ను ఎహ్సాన్ ఖాన్ తన బౌలింగ్ లోనే క్యాచ్ పట్టి పెవిలియన్ కు చేర్చాడు. దాంతో వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన ఫకర్ జమాన్ తో రిజ్వాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇద్దరూ కలిసి వికెట్ల మధ్య పరుగెత్తుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే తొలి పది ఓవర్ల వరకు పాకిస్తాన్ స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. పది ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 64 పరుగులే చేసింది. కానీ డ్రింక్స్ తర్వాత పాక్ ఇన్నింగ్స్ జోరు పెరిగింది. మహ్మద్ ఘజన్ఫర్ వేసిన 11వ ఓవర్లో రిజ్వాన్ సిక్సర్ కొట్టి పాక్ స్కోరుబోర్డుకు ఊపుతెచ్చాడు. ఆ తర్వత ఓవర్లలో రిజ్వాన్, జమాన్ లు వికెట్ల మధ్య పరుగెత్తుతూనే బంతిని బౌండరీ లైన్ దాటించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 16 ఓవర్లకు పాక్ స్కోరు129 పరుగుల వద్ద ఉంది.
కానీ 17వ ఓవర్ తొలి బంతికి ఎహ్సాన్ ఖాన్.. ఫకర్ జమాన్ ను ఔట్ చేసి 116 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఫకర్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన ఖుష్దిల్ తో రిజ్వాన్ పాక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. చివరి రెండు ఓవర్లలో ఖుష్దిల్ బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ స్కోరు 180 దాటింది. హాంకాంగ్ బౌలర్లలో ఎహ్సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు వికెట్లు తీయకపోయినా పాకిస్తాన్ బ్యాటర్లను బాగా కట్టడిచేశారు.