
శ్రీలంకలో బుధవారం గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన తర్వాత ఎమర్జెన్సీ విధించారు అక్కడి తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే. ఎమర్జెన్సీ ప్రకటనతో దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. కర్ఫ్యూతో రాజధాని కొలంబోతో పాటు ఇతర నగరాలన్నీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేశంలో టెస్టు సిరీస్ నిర్వహిస్తామంటోంది శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ). ఈనెల 16 నుంచి పాకిస్తాన్ తో జరుగబోయే రెండు మ్యాచుల సిరీస్ కు జట్టును కూడా ప్రకటించింది.
ఈనెల 16 నుంచి 20 వరకు తొలి టెస్టు, 24 నుంచి 28 వరకు రెండు టెస్టులు జరగాల్సి ఉంది. ఈమేరకు పాకిస్తాన్ జట్టు ఇప్పటికే లంకకు వచ్చింది. అంతేగాక ఆ జట్టు జులై 11-13 మధ్య శ్రీలంక లెవన్ తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది.
ఇదిలాఉండగా తాజాగా లంక క్రికెట్ బోర్డు.. పాకిస్తాన్ తో సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టు లో ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియా, లక్షిత మణసింఘె, చమీక కరుణరత్నె మరోసారి మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఇక ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 12 వికెట్లతో చెలరేగిన ప్రభాత్ జయసూర్య తిరిగి జట్టులోకి స్థానం నిలుపుకున్నాడు.
పాక్ తో సిరీస్ కు లంక జట్టు: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), పథుమ్ నిస్సంక, ఒషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్, నిరోశన్ డిక్వెల్ల, దినేశ్ చండిమాల్, రమేశ్ మెండిస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశనక, ప్రభాత్ జయసూర్య, దునిత్ వెల్లలెగె, జెఫ్రీ వెండర్సీ
పాక్-శ్రీలంక టెస్టు షెడ్యూల్ :
- తొలి టెస్టు జులై 16-20: గాలే
- రెండో టెస్టు జులై 24-28 : కొలంబో
అవసరమైతే తప్పదు : శ్రీలంకలో ఏర్పడిన అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ జరుగుతుందా..?లేదా..? అనే ప్రశ్నపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి చెందిన ప్రతినిధులు స్పందిస్తూ.. ‘ఇప్పటికైతే సిరీస్ కువచ్చిన ముప్పేమీ లేదు. మా రెండు బోర్డులు పరస్పరం టచ్ లోనే ఉన్నాయి. పరిస్థితులు చేజారిపోతే మాత్రం తుది నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు సిరీస్ కు వచ్చిన ఢోకా ఏమీలేదు..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. రెండు బోర్డులు పట్టుబట్టి ఆడిస్తున్న ఈ సిరీస్ ఎలా సాగుతుందో అని ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచం కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నది.