
నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లహిరు కుమార వేసిన బౌన్సర్ హెల్మెట్కి బలంగా తాకిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా మూడో టీ20 మ్యాచ్కి దూరమయ్యాడు ఇషాన్ కిషన్....
తాజాగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2022 వామప్ మ్యాచులో సెన్సేషనల్ బ్యాటర్ స్మృతి మంధానకి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఛేదనలో గత 10 ఇన్నింగ్స్ల్లో 7 హాఫ్ సెంచరీలు చేసి ‘రన్ మెషిన్’గా గుర్తింపు తెచ్చుకున్న స్మృతి మంధాన... వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టుకి కీలక ప్లేయర్గా మారింది...
సౌతాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 23 బంతుల్లో 12 పరుగులు చేసిన స్మృతి మంధాన... సౌతాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌలింగ్లో గాయపడింది. ఇస్మాయిల్ వేసిన బౌన్సర్, మంధాన హెల్మెట్ను బలంగా తాకింది...
ఫీల్డ్లోకి వచ్చిన ఫిజియో స్మృతి మంధానను పరీక్షించారు. మంధానకి అయిన గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ కోసం పంపించారు అధికారులు. వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు స్మృతి మంధానకి ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో టీమిండియా అభిమానుల్లో గుబులు రేగుతోంది...
ఆరంభంలో మెరుపులు మెరిపించి, ఆశలు రేపిన యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ, ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తోంది. దీంతో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో సబ్బినేని మేఘనాని ఓపెనర్గా ప్రయత్నించి చూసింది భారత మహిళా జట్టు...
మేఘనా కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వికెట్ కీపర్ యషికా భటియాతో కలిసి ఓపెనింగ్ చేసింది స్మృతి మంధాన. మంధాన గాయం తీవ్రత కారణంగా వన్డే వరల్డ్ కప్ టోర్నీకి దూరమైతే భారత జట్టుకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది...
39 ఏళ్ల కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు సీనియర్ పేసర్ జులన్ గోస్వామిలకు కూడా ఇదే ఆఖరి టోర్నీ అని సమాచారం. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఓపెనర్ యషికా భాటియా 58 పరుగులు చేయగా టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 114 బంతుల్లో 9 ఫోర్లతో 103 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులకి పరిమితమైంది...
ఓపెనర్ లోరా వాల్వార్ట్ 83 పరుగులు, కెప్టెన్ సుని లూజ్ 86 పరుగులు, మరిజాన్నే క్యాప్ 31 పరుగులు చేసి ఆకట్టుకున్నా మిగిలిన ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. మార్చి 1న వెస్టిండీస్తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడే భారత మహిళా జట్టు, మార్చి 6న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో దాయాది పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది.