
ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఆదివారం ఆ జట్టుకు చెందిన కొత్త లోగోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. గతేడాది ఐపీఎల్ కొత్త జట్ల వేలంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ పార్ట్నర్స్.. తమ సహచర జట్టు లక్నోతో పోల్చితే అన్ని విషయాల్లో వెనుకబడే ఉంది. వేలం ముగిసి.. మరో నెల రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జట్టు అధికారిక లోగోను విడుదల చేసింది. ఈ లోగోపై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ (జీటీ) ట్విట్టర్ లో విడుదల చేసిన లోగోలో కొత్తదనం ఏమీ లేదని, దాని కోసం ఎంతో హైప్ క్రియేట్ చేసి ఊరించి ఉసూరుమనిపించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదో పనికిమాలిన లోగో అని.. దీనితో పోల్చితే లక్నో సూపర్ జెయింట్స్ లోగో చాలా బెటరని ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆదివారం విడుదల చేసిన లోగో.. త్రిభుజంలో గుజరాత్ టైటాన్స్ అని రాసి ఉంది. తమ జట్టుకు ఏదో ఒక లోగో ఉండాలనే ఆరాటం తప్ప అందులో కొత్తధనమేమీ లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక మరికొంతమందైతే.. ‘130 ఎంబీ డేటా బొక్క..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
లోగో పై పలువురు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. ‘జీటీ లోగో ఏమంత ఆసక్తికరంగా లేదు. సారీ..’, ‘దీనికంటే లక్నో లోగో కాస్త బెటర్..’, ‘అంతో ఇంతో పేరు ఫర్వాలేదు గానీ ఈ లోగో మాత్రం సాధారణంగా ఉంది..’, ‘ఈ లోగోను చూస్తుంటే నిర్వాహకులు దీనిమీద అస్సలు కసరత్తులు చేసినట్టు కనిపించడం లేదు. ఏదో ఎంఎస్ ఆఫీస్ లో డిఫరెంట్ గా ఉన్న ఫోంట్ స్టైల్ తో లోగో రూపొందించి మమ అనిపించారు..’, ‘ఈ లోగోను చూడగానే.. ఒక బిజినెస్ మెన్ బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయినట్టుగా అనిపించింది...’, ‘ఈ పనికిమాలిన చెత్తకంటే లక్నో లోగో కొంచెం నయం అనిపిస్తున్నది..’, ‘ఈ లోగో తయారు చేసిన ఎడిటర్ ను చోర్ బజార్ నుంచి తీసుకొచ్చారా ఏమి..?’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ను రూ. 15 కోట్లతో దక్కించుకుని సారథిగా నియమించిన గుజరాత్.. అంతే ధర తో ఆఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా ఎంపిక చేసుకుంది. శుభమన్ గిల్ కు రూ. 8 కోట్లు వెచ్చించింది. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో.. పేసర్ లూకీ ఫర్గూసన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్, యంగ్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా కోసం ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేసింది. మహ్మద్ షమీని రూ.6.25 కోట్లకు దక్కించుకున్న ఆ ఫ్రాంచైజీ.. జేసన్ రాయ్ ను రూ. 2 కోట్లకు అభినవ్ సదరంగనీని రూ.2.6 కోట్లకు, ఆర్ సాయి కిషోర్ని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.