కరోనా దెబ్బ: ఇప్పుడిప్పుడే భారత్ లో పాపులారిటీ అప్పుడే ప్రపంచ కప్ వాయిదా!

By Sree sFirst Published Apr 5, 2020, 3:53 PM IST
Highlights

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లపైనా పడింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అమ్మాయిల అండర్‌-17 వరల్డ్‌కప్‌ అనూహ్యంగా వాయిదా పడింది. 

కరోనా రక్కసి కోరలు చాస్తున్నవేళ ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఈ ప్రభావం క్రీడారంగంపై కూడా పడింది. ఈ క్రీడా ఆ క్రీడా అని తేడా లేకుండా ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ వరకు అన్ని క్రీడా సంగ్రామాలు వాయిదా పడ్డాయి. 

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లపైనా పడింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అమ్మాయిల అండర్‌-17 వరల్డ్‌కప్‌ అనూహ్యంగా వాయిదా పడింది. 

భారత్‌లో జరగాల్సిన అండర్‌-17 వరల్డ్‌కప్‌తో పాటు ఆగస్టులో నిర్వహించాల్సిన అండర్‌-20 వరల్డ్‌కప్‌ను సైతం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిఫా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కోవిడ్ దెబ్బకు కాన్ఫరెన్స్‌ కాల్‌లో తొలిసారి సమావేశమైంది. 

ఆగస్టు/సెప్టెంబర్‌లో ఫిఫా అండర్‌-20 మహిళల వరల్డ్‌కప్‌కు పనామా/కోస్టారికా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. నవంబర్‌లో అండర్‌-17 వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ రెండు టోర్నీలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించే వెసులుబాటు ఉంది. 

కాకపోతే.... కరోనా వైరస్‌ కారణంగా అర్హత మ్యాచులు ఎక్కడికక్కడే వాయిదా పడ్డాయి. తప్పని పరిస్థితుల్లో ఏజ్‌ గ్రూప్‌ వరల్డ్‌కప్‌లను ఫిఫా వాయిదా వేసింది. నూతన షెడ్యూల్‌ను పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది. 

ఫిఫా ఫుట్సల్‌ (ఇండోర్‌ గేమ్‌, ఒక్కో జట్టులో ఐదుగురు ఆటగాళ్లు) వరల్డ్‌కప్‌పై నిర్ణయాన్ని ఏప్రిల్‌ ఆఖర్లో వెల్లడించే అవకాశం ఉంది. ఈ వరల్డ్‌కప్‌ సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. దీంతో పాటు 2020 జూన్‌ వరకు జరగాల్సిన అన్ని ఫిఫా మెన్స్‌, ఉమెన్స్‌ మ్యాచులను వాయిదా వేసింది. 

అండర్‌-17 ఫిఫా వరల్డ్‌కప్‌ను ఘనంగా నిర్వహించి, వీక్షకుల పరంగా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన భారత్‌, అండర్‌-17 బాలికల వరల్డ్‌కప్‌ నిర్వహణతో మరోసారి భారత్‌లో ఫుట్‌బాల్‌కు పాపులారిటీ తీసుకురావాలని భావించింది. 

అండర్‌-17 వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) వీక్షకుల్లో 50 శాతం పెరుగుదల ఆ విషయాన్ని బలపరుస్తోంది.

click me!