లాక్ డౌన్: 200 కిమీ నడిచి, హైవేపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు

By telugu teamFirst Published Mar 29, 2020, 9:08 AM IST
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో వందలాది కిలోమీటర్ల దూరంలో గల తన గ్రామానికి వెళ్లడానికి కాలినడకన బయలుదేరి డెలివరీ బాయ్ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. యూపీలోని ఆగ్రా జాతీయ రహదారిపై అతను కుప్పకూలిపోయాడు.

ఆగ్రా: దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తన ఇంటికి చేరుకునే క్రమంలో ఓ వ్యక్తి మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ లోని తన ఇంటికి చేరుకోవడానికి అతను దాదాపు 200 కిలోమీటర్లు నడిచాడు. చివరకు అతను ప్రాణాలు వదిలాడు. 

రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో డెలివరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తమ సొంత ఊళ్లకు, పట్టణాలకు బయలుదేరిన వేల మందిలో అతను ఒక్కడు. ఉద్యోగాలను వదిలేశారు. ఆశ్రయం లేదు. డబ్బులు లేవు. రవాణా వ్వవస్థ లేకపోవడంతో వారిలో చాలా మంది కాలినడకన తమ స్వస్థలాలకు చేరుకోవడానికి పూనుకున్నారు. 

రణవీర్ సింగ్ ఢిల్లీ నుంచి 326 కిలోమీటర్ల దూరంలో గల మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలోని తన స్వల్థలం చేరుకోవడానికి బయలుదేరాడు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోని జాతీయ రహదారిపై కుప్పకూలిపోయాడు. స్థానిక దుకాణుదారు చాయ్, బిస్కట్లు ఇచ్చాడు. గుండెపోటుతో అతను మరణించాడు. 

శనివారం సాయంత్రం వేలాది మంది వలస కార్మికులు బస్సు టెర్మినల్స్ కు చేరుకున్నారు. ఇళ్లకు వెళ్లడానికి చేసే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వారు గుమికూడారు. బస్సులు, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను అన్నింటినీ లాక్ డౌన్ లో భాగంగా అపేయడంతో కాళ్లకు పనిచెప్పేందుకు పూనుకున్నారు. 

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు వారి కోసం బస్సులను ఏర్పాటు చేశాయి. తాము వేయి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పగా, తాము 200 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 

ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో తీవ్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దాంతో ఆహారం, కనీస సౌకర్యాలు లేకుండా వేలాది మంది బాధపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఆ విమర్శలను కొట్టిపారేస్తోంది. 

click me!