ఇండియాలో 12 గంటల్లో 355 కొత్త కరోనా కేసులు: 68కి చేరిన మృతులు

By telugu teamFirst Published Apr 4, 2020, 11:28 AM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2900 దాటింది. కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య 68కి చేరుకుంది. 

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం 2902 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 68కి చేరుకుంది. ఇప్పటి వరకు 229 మంది కోలుకున్నారు. మొదటి రెండు వారాలతో పోలిస్తే కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గింది.

కాగా, శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 68కి చేరుకుంది.

మహరాష్ట్రలో అత్యధికంగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు. 

ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి. 

click me!