జూమ్‌కు పోటీగా గూగుల్‌ కొత్త యాప్: ఒకేసారి 16 మందితో వీడియో కాన్ఫరెన్స్

By Sandra Ashok KumarFirst Published Apr 24, 2020, 11:34 AM IST
Highlights

కరోనా నేపథ్యంలో అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్.. ప్రత్యేకించి వీడియోలు కాలక్షేపంగా మారుతున్నాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి జూమ్ యాప్ ముందుకు వచ్చింది. అది క్షేమకరం కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో సెర్చింజన్.. గూగుల్ మీట్ పేరిట మరో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ వేళ వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు జూమ్‌ యాప్‌ అంతగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 

దీంతో జూమ్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. దీంతో సెర్చింజన్ ‘గూగుల్’ తన హ్యాంగ్‌ అవుట్‌ మీట్‌ను గూగుల్‌ మీట్‌గా మార్చి తీసుకొచ్చింది. అందులో ఇప్పుడు గూగుల్‌ కొత్త ఫీచర్లను జోడించింది.

గూగుల్‌ మీట్‌లో ఇప్పటివరకు ఒక స్క్రీన్‌లో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 16 మందికి పెంచారు. వీడియోలో మాట్లాడేటప్పుడు మీరు ఉన్న ప్రదేశంలో లైటింగ్‌ కండిషన్‌ సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా అవతలివారికి వీడియో స్పష్టంగా కనిపించే ఏర్పాటు చేశారు. 

ఈ వసతి ప్రస్తుతం మొబైల్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీటింగ్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను ఇతరులకు షేర్‌ చేసుకోవడానికి వీలుగా ‘ప్రెజెంట్‌ ఏ క్రోమ్‌ ట్యాబ్‌’ సదుపాయం తెచ్చారు. జూమ్‌లో మొత్తం బ్రౌజర్‌ షేర్‌ అవుతుంది. దీంతో పాటు నాయిస్‌ కాన్సిలేషన్‌ సదుపాయాన్నీ తీసుకొస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. 

అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నప్పుడు వెనుకవైపు ఎవరైనా రావడం, అటుఇటు కదలడం లాంటివి ఇబ్బందిపెడుతుంటాయి. వీటిని కూడా ఫిక్స్‌ చేసేలా గూగుల్‌ మీట్‌లో మార్పులు చేస్తున్నారు. 

భారీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అత్యుత్తమ లే అవుట్లతో పాటు మరిన్ని డివైజ్‌లకు సపోర్ట్‌ కల్పిస్తామని గూగుల్ తెలిపింది. అందరు జీ సూట్‌ వినియోగదారులకు గూగుల్ మీట్‌ యాప్‌కు సంబంధించిన అన్ని అడ్వాన్స్‌డ్‌ వసతులు అందుబాటులోకి తెచ్చామని, వినియోగదారుల డేటా భద్రతకు కట్టుబడి ఉన్నామని సెర్చింజన్ పేర్కొంది.

click me!