
చాలా మంది భారతీయులు మెరుగైన విద్యా అవకాశాలు, కెరీర్ అవకాశాలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్ల లభ్యత కోసం విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం భారతదేశం యువ తరానికి పారిశ్రామికవేత్తగా మారడానికి అనేక అవకాశాలతో ‘స్టార్టప్ హబ్’గా ఎదుగుతోందన్నారు జెరోదా సీఈవో నిఖిల్ కామత్. ఆయన ఇటీవల యునైటెడ్ స్టేట్స్లోని ఫ్యాన్సీ కాలేజీల నుండి గ్రాడ్యుయేట్ చేసి, అక్కడ పని చేస్తున్న తన స్నేహితుల కోసం ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఏదైనా ప్రారంభించాలనే ఉద్దేశంతో వారు స్వదేశానికి తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ కామత్ రెండు గ్రాఫ్లను షేర్ చేశారు. ఇందులో ఒకటి ‘Recession Probabilities Worldwide 2023’, మరొకటి ‘World Output Projection 2023’ .
Recession Probabilities Worldwide 2023 డేటా ప్రకారం.. భారతదేశం ఈ ఏడాది సున్నా శాతం మాంద్యం ప్రభావానికి గురవుతుంది. అయితే ఇదే సమయంలో యూకేలో 75, అమెరికాలో 65 శాతం మాంద్యం వచ్చే అవకాశాలు వున్నాయి. ఆ తర్వాత కెనడాలో 60 శాతం, జర్మనీలో 60 శాతం ఆర్ధిక మాంద్యం వచ్చే అవకాశాలు వున్నాయి. మరోవైపు వాస్తవ జీడీపీ డేటాను పరిశీలిస్తే భారతదేశం 5.9 శాతం జీడీపీ అంచనాతో తొలి స్థానంలో నిలిచింది. అటు అమెరికా 1.6 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని, కెనడా 1.5 శాతంతో వున్నాయి. దీనిని ఉద్దేశిస్తూ నిఖిల్ కామత్ స్పందించారు. ఈ దశాబ్ధం భారతదేశానిదేనని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అవకాశం వుందన్నారు . పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ ట్వీట్కు 32.4కు పైగా వ్యూస్.. 2000కు పైగా లైక్లు, కామెంట్స్, రియాక్షన్స్ పొందింది.
నిఖిల్ కామత్ పంచుకున్న మరో అంశం.. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ కు సంబంధించినది. దీని ప్రకారం.. 2023 ప్రపంచ అవుట్పుట్ ప్రొజెక్షన్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా 7వ స్థానంలో నిలిచింది. కామత్ చేసిన ట్వీట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వచ్చే దశాబ్ధ కాలంలో భారతదేశం అన్ని ప్రధాన ఆర్ధిక వ్యవస్థలను అధిగమిస్తుందని ఓ నెటిజన్ల ఆకాంక్షించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తుందన్నాడు. ఇలాంటప్పుడు బయటి అవకాశాల కోసం ఎందుకు విద్యార్ధులు భారతదేశాన్ని విడిచిపెడుతున్నారని అతను ప్రశ్నించాడు.
అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం.. భారత్లో ప్రాథమిక సదుపాయాలు, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు లేవని అభిప్రాయపడ్డారు. అందుకే పాశ్చాత్య దేశాలలో స్థిరపడిన భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చి వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడటం లేదని అభిప్రాయపడ్డారు.