కరోనా కల్చర్: మున్ముందు వాళ్ళు వర్క్ ఫ్రం హోంకే ప్రియారిటీ...

By Sandra Ashok KumarFirst Published Apr 4, 2020, 3:19 PM IST
Highlights

ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌),  సంస్థకూ ఉద్యోగులకూ ప్రయోజనకరమని దిగ్గజ కంపెనీల మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) అధిపతులు పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా ఉద్యోగులకు గంటల తరబడి కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 ప్రతాపంతో పలు కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా మహమ్మారి భయాలు క్రమంగా వైదొలగినా నయా పని సంస్కృతి మాత్రం కొనసాగుతుందని కార్పొరేట్‌ కంపెనీలు పేర్కొంటున్నాయి. 

ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌),  సంస్థకూ ఉద్యోగులకూ ప్రయోజనకరమని దిగ్గజ కంపెనీల మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) అధిపతులు పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా ఉద్యోగులకు గంటల తరబడి కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.

పని-జీవితం సమన్వయపరుచుకోవడంలో వెసులుబాటు లభిస్తుందని వివిధ సంస్థల హెచ్ఆర్ అధిపతులు తెలిపారు. ఇక యాజమాన్యాలకు నిర్వహణ ఖర్చు తగ్గడం, ఉత్పాదకత పెరగడం వంటి ప్రయోజనాలు చేకూరతాయని వారు పేర్కొన్నారు.

వర్చువల్‌ పని ప్రదేశాలదే భవిష్యత్‌ అని యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్పీజీ గ్రూప్‌, వేదాంత, ఈవై, కాగ్నిజెంట్‌, టైటాన్‌, డెలాయిట్‌, విర్ల్‌పూల్‌, పేటీఎం, సెయింట్‌ గోబెయిన్‌ ఇండియా,  వంటి పలు ప్రముఖ కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగం అధిపతులు హెడ్స్‌ అభిప్రాయపడ్డారు.

also read దేశవ్యాప్తంగా లాక్​డౌన్:​ ఇల్లు కదలని ఇండియన్లు...సొంతూళ్లకు హైదరాబాదిలు

ఇంటి నుంచి పనిచేసే విధానం ఇక ముందు కొనసాగుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కమల్‌ వెంపటి అన్నారు. కస్టమర్లతో భేటీ అవసరం లేని పనులన్నీ మారుమూల నుంచీ చక్కబెట్టవచ్చని, దాదాపు 30% మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. 

వర్క్ ఫ్రం హోం ద్వారా సులభతర వాణిజ్యం మెరుగు పడటంతోపాటు వ్యయాల తగ్గింపు కలిసివస్తుందని ఈవై ఇండియా పార్టనర్‌, టాలెంట్‌ లీడర్‌ సందీప్‌ కోహ్లి అన్నారు. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ రోల్స్, ఫోన్ బ్యాంకింగ్, హెచ్ఆర్, కార్పొరేట్ ఆఫీస్ పంక్షన్స్ వంటి బ్యాంకు సేవలు ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారా చేపట్టాలని సూచించారు.

సులభతర వాణిజ్యం పెరుగుదల, వ్యయం తగ్గించడం కోసం వర్క్ ఫ్రం హోం మెరుగైన పద్దతని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా పార్టనర్ సందీప్ కోహ్లీ, బ్యాంక్ఆఫ్ బరోడా స్ట్రాటర్జిక్ హెచ్ఆర్, హెచ్ఆర్ ఇంటగ్రేషన్ హెడ్ జాయ్ దీప్ దత్తా రాయ్ తెలిపారు. చాలా దేశాల్లో వర్క్ ఫ్రం హోం ఓ సానుకూల పనివిధానంగా అందరూ ఆమోదించడం మనం చూస్తున్నామని కాగ్నిజెంట్‌ ఇండియా చీఫ్‌ రామ్ కుమార్‌ రామమూర్తి వ్యాఖ్యానించారు. 

గతంలో ఈ విధానాన్ని అనుసరించని వారు సైతం టెక్నాలజీ వసతులు మెరుగు పడినందున వారికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆర్పీజీ గ్రూప్‌ హెడ్‌ (నైపుణ్యాభివృద్ధి) అజర్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు.
 

click me!